హైదరాబాద్, వెలుగు: కానిస్టేబుల్, ఎస్సై పోస్టుల భర్తీకి ఈ నెల19 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 9న సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. మరోవైపు అభ్యర్థుల వయస్సు సడలింపునకు సంబంధించి తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) నోటిఫికేషన్లలో మార్పులు చేసింది. గతంలో విడుదల చేసిన నాలుగు నోటిఫికేషన్లలోనూ నిర్ధేశిత వయస్సు వివరాలను పొందుపరిచింది.
ఈ మేరకు బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు శనివారం మరో నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కానిస్టేబుల్కు అభ్యర్థుల గరిష్ట వయస్సు 29 ఏండ్లకు పెరగనుండగా.. ఎస్సై పోస్టులకు గరిష్ట వయస్సు 32 ఏండ్లకు పెరగనుంది. దీనికి అదనంగా ఆయా రిజర్వేషన్ కేటగిరీల వారీగా అదనపు సడలింపు వర్తిస్తుంది. ఈ మేరకు tgprb.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు ఫారాలు పంపించాలని చైర్మన్ శ్రీనివాస రావు సూచించారు.
