అర్హులైన పేదలందరికీ సంక్షేమ ఫలాలు.. పారదర్శకంగా సన్నబియ్యం పథకం అమలు..

అర్హులైన పేదలందరికీ సంక్షేమ ఫలాలు.. పారదర్శకంగా సన్నబియ్యం పథకం అమలు..
  • మంత్రులు, ప్రముఖుల వెల్లడి
  • ఉమ్మడి మెదక్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో ..
  • స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

నెట్​వర్క్​, వెలుగు : రాష్ట్రంలో రేషన్ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం శనివారం ఘనంగా ప్రారంభమైంది. సూర్యాపేటలో జరిగిన కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ స్మార్ట్ కార్డుల ఫొటోలపై రాజకీయ రాద్ధాంతాలు ఆపాలన్నారు.  

రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.14.9 వేల కోట్లు వెచ్చించి నిరుపేదలకు నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ చేస్తోందని తెలిపారు. కేంద్రం దొడ్డు బియ్యమే ఇస్తోందని, సన్నబియ్యానికి అయ్యే అదనపు ఖర్చును రాష్ట్రమే భరిస్తోందని పేర్కొన్నారు. 

సిద్దిపేటలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గతంలో కొత్తగా పెళ్ళైన వారికి రేషన్ కార్డులు వచ్చే పరిస్థితి లేకపోయినా, ప్రజాపాలన ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశామని, త్వరలోనే రాష్ట్రంలో 2.5 లక్షల కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేయనున్నట్లు తెలిపారు. 

మహబూబ్ నగర్ కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ గత పదేండ్లలో కొత్త కార్డులు ఇవ్వలేదని, ఇప్పుడు కోటీ ఐదు లక్షల స్మార్ట్ కొత్త రేషన్ కార్డులను జారీ చేసినట్లు తెలిపారు. నారాయణపేటలో మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ గతంలో రేషన్​ బియ్యంపై ఉన్న చిన్నచూపును తొలగించి, ఇప్పుడు నాణ్యమైన సన్నబియ్యం తినాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. 

వనపర్తి జిల్లాలో చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి  మాట్లాడుతూ   జిల్లాలోని 15 మండలాలు, 5 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 1,83,013 కార్డులను అందిస్తున్నట్లు వెల్లడించారు.  నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూల్‌‌‌‌‌‌‌‌ కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో 2,77,457 స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నట్లు 
తెలిపారు.