భార్యపై అనుమానంతో ఇద్దరు పిల్లలు, భార్యను హతమార్చిన భర్త

భార్యపై అనుమానంతో ఇద్దరు పిల్లలు, భార్యను హతమార్చిన భర్త

హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది.  భార్యపై అనుమానంతో..ఇద్దరు పిల్లలతో పాటు భార్యను హతమార్చాడో కిరాతక భర్త. చివరకు అతనూ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఇంటి నుంచి దుర్గంధం రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు..తలుపులు పగులగొట్టగా ..విషయం వెలుగులోకి వచ్చింది. 

ఏం జరిగింది..?
చందానగర్ పాపిరెడ్డి కాలనీలో  నాగరాజు, సుజాత దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇధ్దరు పిల్లలు. కూతురు రమ్య శ్రీ, కుమారుడు టిల్లు. గత ఏడేళ్లుగా  నివాసం ఉంటున్నారు. అయితే భార్య సుజాత టైలరింగ్ చేస్తూ..ఫైనాన్స్ ఇస్తుండేది. అయితే ఆమెపై  అనుమానంతో సుజాతను తరచూ వేధించేవాడని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే భార్యతో పాటు..ఇద్దరు పిల్లలను హత్య చేశాడు. కత్తెరతో ముగ్గురిపై దాడి చేసి హతమార్చినట్లు తెలుస్తోంది. అనంతరం తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

శుక్రవారం నుంచి ఇంటి తలుపులు తీయలేదు. మూడు రోజుల నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో..ఊరు వెళ్లారేమోనని స్థానికులు అనుకున్నారు. కానీ..దుర్గంధం రావడంతో..అనుమానం వచ్చిన స్థానికులు..ఇంటి తలుపులు పగులగొట్టి చూడగా..పిల్లలతో సహా దంపతులు ఇద్దరు విగతజీవులుగా పడి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు..సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు.