
బెంగళూరు: సోషల్ మీడియా కోసం రీల్స్ చేస్తూ ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదవశాత్తూ పదమూడో అంతస్తు నుంచి కిందపడి అక్కడికక్కడే చనిపోయింది. బెంగళూరులో గత శనివారం ఈ విషాదం చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిటీకి చెందిన 20 ఏండ్ల నందిని ఓ హైపర్ మార్కెట్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తోంది.
శనివారం సాయంత్రం తన స్నేహితులతో (ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి) కలిసి పార్టీ చేసుకోవడం కోసం పరప్పన అగ్రహారలో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్కు వెళ్లారు. పార్టీ సమయంలో నలుగురి మధ్య రిలేషన్ విషయంలో గొడవ జరిగింది. అనంతరం నందిని "సాడ్ రీల్" ను షూట్ చేయడానికి రాత్రి 8 గంటల ప్రాంతంలో బిల్డింగ్ టెర్రస్ మీదకు వెళ్లింది.
అక్కడ రీల్ చేస్తున్న సమయంలో అదుపుతప్పి లిఫ్ట్ కోసం ఏర్పాటు చేసిన గుంతలో పడి పోయింది. తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే చనిపోయింది. బాధితురాలు పడిపోయిన తర్వాత ఆమె స్నేహితురాలు 112కు డయల్ చేయగా, హొయసల పోలీసు పెట్రోలింగ్ సిబ్బంది స్పాట్కు చేరుకున్నారు. అయితే, వారు వచ్చేలోపే ఇద్దరు అబ్బాయిలు ఘటనా స్థలం నుంచి పారిపోయారు. ఆ యువతి ప్రమాదవశాత్తూ పడిపోయిందని పోలీసులు భావిస్తున్నారు.