
ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన(సేఫెస్ట్) సిటీగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) రాజధాని అబుదాబి మొదటి స్థానంలో నిలిచింది. క్రౌడ్ సోర్స్డ్ ఆన్లైన్ డేటాబేస్(నంబియో) 2025 క్రైమ్ ఇండెక్స్ ఈ మేరకు తాజా డేటా ఆధారంగా అబుదాబిని ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా ప్రకటించింది.
ఇండియా విషయానికి వస్తే గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ ను సేఫెస్ట్ సిటీగా ఈ ఇండెక్స్ పేర్కొంది. ఈ నగరానికి సేఫ్టీ ఇండెక్స్ స్కోరు 68.6 పాయింట్లు ఇచ్చింది. అహ్మదాబాద్ కు గ్లోబల్ ర్యాంకింగ్ లో 77వ స్థానం దక్కగా, మన దేశంలో మొదటి ప్లేస్ లో నిలిచింది. అలాగే, హైదరాబాద్ 57.3 స్కోరుతో గ్లోబల్ ర్యాంకింగ్స్ లో 139వ స్థానం పొందగా.. మన దేశంలో 6వ స్థానం దక్కించుకుంది.
ఇక మన దేశంలో సెకండ్ ప్లేస్ లో జైపూర్(65.2), మూడో స్థానంలో కోయంబత్తూర్ (62), నాలుగో స్థానంలో చెన్నై (60.03), ఐదో స్థానంలో పుణె (58.7), ఏడో స్థానంలో ముంబై (సేఫ్టీ ఇండెక్స్ స్కోరు 55.9) నిలిచాయి. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా కోల్కతా(53.3), గురుగ్రామ్ (46.0), బెంగళూరు (45.7), నోయిడా(44.9), ఢిల్లీ (41.0) ఉన్నాయి.
ఆయా నగరాల్లో జరిగే నేరాల ఆధారంగా ఈ రిపోర్టును సిద్ధం చేస్తారు. రాత్రి పూట, పగటి వేళ జరిగే నేరాలు, నిర్దిష్ట నేరాలు, విధ్వంసాలు, దొంగతనాలు, హత్యలను పరిగణనలోకి తీసుకొని ఈ రిపోర్టును సిద్ధం చేసినట్టు నంబియో ఇండెక్స్ వెల్లడించింది.