- స్పీకర్కు తెలంగాణ పంచాయతీ రాజ్ చాంబర్ ఫిర్యాదు
హైదరాబాద్, వెలుగు: జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి రాష్ట్రంలోని సర్పంచులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఛాంబర్ ప్రతినిధులు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను కలిసి ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా చింపుల సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. గ్రామాలకు నిధులు ఇవ్వను, రాజకీయంగా ఎదగనివ్వను, సర్పంచులను చంపేస్తానని ఎమ్మెల్యే బెదిరించడం అత్యంత దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పంచాయతీలకు వచ్చే నిధులు రాజ్యాంగబద్ధమైనవని, అవి ఎమ్మెల్యే సొంత డబ్బులు కాదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే తీరు దొరల అహంకారాన్ని తలపిస్తోందని, ఇది సర్పంచుల హక్కులను హరించడమేనని చెప్పారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలు సర్పంచుల మనోభావాలను దెబ్బతీశాయని, ఆయనపై తక్షణమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ను సత్యనారాయణ కోరారు.
