వెలుగు బిజినెస్ డెస్క్ : ఒక్క రోజులోనే తన రూ. 48 వేల కోట్ల సంపద ఆవిరయిపోవడానికి కారణమైన రిపోర్టు ఇచ్చిన హిండెన్బర్గ్పై లీగల్ యాక్షన్కు అదానీ గ్రూప్ రెడీ అవుతోంది. అమెరికా, ఇండియాలలోని చట్టాలను ఇందుకోసం స్టడీ చేస్తున్నామని అదానీ గ్రూప్ లీగల్ హెడ్ జతిన్ జలుంధ్వాలా ఒక స్టేట్మెంట్లో చెప్పారు. ఇన్వెస్టర్లను, ప్రజలను తప్పుదోవపట్టించేలా రిపోర్టు తెచ్చిన హిండెన్బర్గ్ అసలు ఉద్దేశాలు తేల్చేందుకు చర్యలుంటాయని అదానీ గ్రూప్ చెబుతోంది. గ్రూప్ పరువు, ప్రతిష్టలను మంటగలిపేలా ఉద్దేశపూర్వకంగానే ఈ రిపోర్టును తెచ్చినట్లు విమర్శిస్తోంది.
అదానీ నష్టం రూ. 48 వేల కోట్లు...
ఇన్వెస్టర్లకు నష్టం రూ. లక్ష కోట్లు
ఏడు లిస్టెడ్ కంపెనీల షేర్లు పతనమవడంతో ఆసియాలోనే సంపన్నుడైన గౌతమ్ అదానీకి భారీగానే నష్టం కలిగింది. అదానీ ఎంటర్ప్రైజస్ లిమిటెడ్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ ఓపెన్ కావడానికి ఒకటి, రెండు రోజుల ముందే ఈ రిపోర్టును ఉద్దేశపూర్వకంగానే హిండెన్బర్గ్ బయటపెట్టిందని అదానీ గ్రూప్ ఆరోపిస్తోంది. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ డేటా ప్రకారం గౌతమ్ అదానీ బుధవారం ఒక్క రోజులోనే తన సంపదలో అయిదు శాతం అంటే రూ. 48,600 కోట్లు (6 బిలియన్ డాలర్లు) పోగొట్టుకున్నారు. ఫలితంగా జనవరి 26 నాటికి ఆయన నెట్వర్త్ 113 బిలియన్ డాలర్లకు తగ్గిపోయింది. ఇక అదానీ గ్రూప్లోని కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లయితే ఈ ఒక్కరోజులోనే ఏకంగా రూ. లక్ష కోట్లను పోగొట్టుకున్నారు.
కేసు వేస్తే వేసుకోండి
తమ రిపోర్ట్ లేవనెత్తిన సమస్యలపై అదానీ గ్రూప్ మాట్లాడడం లేదని హిండెన్బర్గ్ రీసెర్చ్ పేర్కొంది. లీగల్ యాక్షన్ తీసుకుంటామని అదానీ గ్రూప్ ప్రకటించడంతో ఈ కంపెనీ స్పందించింది. ‘మా రిపోర్ట్ విడుదల చేసి 36 గంటలు కావొస్తోంది. మేము లేవనెత్తిన ఒక్క సమస్యపై కూడా అదానీ గ్రూప్ ఇప్పటి వరకు స్పందించలేదు. కంపెనీ ఇప్పటికైనా పారదర్శంగా ఉంటుందనే ఉద్దేశంతో మా రిపోర్ట్ చివరిలో స్ట్రెయిట్గా 88 ప్రశ్నలు అడిగాం. ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా అదానీ గ్రూప్ తమకు వార్నింగ్స్ ఇస్తోంది. గత రెండేళ్లుగా రీసెర్చ్ చేసి 106 పేజీల, 32,000 పదాల, 720 కి పైగా రిఫరెన్స్లతో తెచ్చిన రిపోర్ట్ను ‘రీసెర్చ్ చేయకుండా’ తీసుకొచ్చామని అదానీ గ్రూప్ మీడియాలో స్టేట్మెంట్ ఇచ్చింది. ఇండియా, యూఎస్లోని చట్టాలను క్షుణ్ణంగా విశ్లేషించి తమపై అదానీ గ్రూప్ తీసుకోనున్న చర్యలకు కౌంటర్ వేస్తాం. కంపెనీ లీగల్ యాక్షన్స్ను స్వాగతిస్తున్నాం. మా రిపోర్ట్కు మేము కట్టుబడి ఉన్నాం. అదానీ గ్రూప్ సీరియస్గా ఉంటే మేము పనిచేస్తున్న యూఎస్లో కూడా వీరు కేసు ఫైల్ చేయొచ్చు’ అని హిండెన్బర్గ్ రీసెర్చ్
ట్విట్టర్లో పేర్కొంది.
నేటి నుంచే అదానీ ఎఫ్పీఓ...
అదానీ ఎంటర్ప్రైజస్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీఓ) శుక్రవారం (నేటి) నుంచి మొదలవుతోంది. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి ఈ కంపెనీ ఇప్పటికే రూ. 5,985 కోట్లను సమీకరించింది. 30 మంది ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు 1,82,68,925 షేర్లను ఒక్కో షేర్కు రూ. 3,276 ధర వద్ద అదానీ ఎంటర్ప్రైజస్ అలాట్ చేసింది. ఎఫ్పీఓ ధరలో అప్పర్ బాండ్ రూ. 3,276 కావడంతో, ఆ రేటుకే యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్లను అలాట్ చేశారు. అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (ఏడీఐఏ), మేబ్యాంక్ ఏషియా, గోల్డ్మన్ శాచ్స్, నోమురా ఫైనాన్షియల్, సొసైటె జనరాలె, బీఎన్పీ పారిబస్, సిటీ గ్రూప్, మోర్గాన్ స్టాన్లే వంటి గ్లోబల్ క్లాస్ ఇన్వెస్టర్లందరూ అదానీ ఎంటర్ప్రైజస్ లిమిటెడ్ ఎఫ్పీఓలో యాంకర్ ఇన్వెస్టర్లుగా ఉన్నారు. కానీ, దేశీయ ఇన్వెస్టర్లలో మాత్రం ఇన్సూరెన్స్ కంపెనీలే భాగం పంచున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ ఎందుకో ఈ ఎఫ్పీఓకి దూరంగా ఉన్నాయి. యాంకర్ పోర్షన్లో 5 శాతం అంటే 9,15,748 షేర్లను ఎల్ఐసీ తీసుకుంది. ఎఫ్పీఓకి ముందే ఎల్ఐసీకి అదానీ ఎంటర్ప్రైజెస్లో 4.2 శాతం వాటా ఉంది. ఇప్పుడది మరింత పెరిగింది. ప్రీ ఎఫ్పీఓ ప్లేస్మెంట్లో ఎల్ఐసీతోపాటు ఎస్బీఐ లైఫ్ఇన్సూరెన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్లు పాల్గొన్నాయి. రూ. 20 వేల కోట్ల సమీకరణకు తలపెట్టిన ఈ ఎఫ్పీఓ శుక్రవారం మొదలై, వచ్చే మంగళవారం క్లోజవనుంది. అప్పులలో కొంత మొత్తాన్ని తీర్చేయడానికి, విస్తరణ ప్రాజెక్టుల కోసం ఎఫ్పీఓ ఫండ్స్ను వాడుకోవాలని అదానీ గ్రూప్ ఆలోచన. సబ్సిడరీ కంపెనీలు అదానీ ఎయిర్పోర్ట్, అదానీ రోడ్ ట్రాన్స్పోర్ట్, ముంద్రా సోలార్ వంటి వాటి అప్పులలో కొంత భాగాన్ని తిరిగి చెల్లించాలని అదానీ గ్రూప్ ప్లాన్ చేస్తోంది. సరిగ్గా ఎఫ్పీఓ టైములోనే హిండెన్బర్గ్ రిపోర్టు బయటకు రావడంతో గ్రూప్లోని లిస్టెడ్ కంపెనీల షేర్లు బాగా పడుతున్నాయి.