మరో వివాదంలో 'ఆదిపురుష్'

మరో వివాదంలో 'ఆదిపురుష్'

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఆదిపురుష్' మూవీలో నటిస్తున్నాడు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. రామాయణం ఇతిహాసం ఆధారంగా భారీ బడ్జెట్ తో టీసిరీస్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా.. కృతి స‌న‌న్ సీతాదేవి పాత్రల్లో క‌నిపించ‌నున్నారు. సైఫ్ ఆలీ ఖాన్ రావ‌ణాసురుడిగా క‌నిపించ‌బోతున్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ చిత్రం ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాకు వ్యతిరేకంగా ఢిల్లీ తీస్ హజారీ కోర్టులో పిటిషన్ దాఖలైంది. మూవీ టీజర్ ను యూట్యూబ్ తదితర వేదికల నుంచి తొలగించాలని, సినిమా విడుదలపై స్టే విధించాలని ఆ పిటిషన్ లో కోరారు. దర్శకుడు ఓం రౌత్, నిర్మాత భూషణ్ కుమార్ లకు వ్యతిరేకంగా రాజ గౌరవ్ అనే న్యాయవాది ఈ పిటిషన్ వేశారు. 

ఆదిపురుష్ టీజర్ లో రాముడ్ని, ఆంజనేయుడ్ని అసంబద్ధంగా చూపించారని రాజ గౌరవ్ ఆరోపించారు. వారు తోలు పట్టీలతో కూడిన దుస్తుల్లో ఉన్నట్టుగా టీజర్ లో కనిపిస్తోందని వివరించారు. ఇక, రావణుడ్ని చాలా చవకబారుగా చూపించారని తెలిపారు. మోడ్రన్ హెయిర్ స్టయిల్, చెవులపై బ్లేడ్ సింబల్స్ తో రావణుడ్ని చిత్రీకరించారని పిటిషనర్ వివరించారు. మొఘల్ చక్రవర్తుల పూర్వీకుడిలా కనిపిస్తున్న రావణుడు గబ్బిలంపై స్వారీ చేస్తున్న దృశ్యాలు కూడా టీజర్ లో ఉన్నాయని అన్నారు. శివభక్తుడైన రావణుడికి మీసాలు ఉంటాయని, తలపై నిత్యం బంగారు కిరీటం ఉంటుందని వెల్లడించారు. రావణుడి వాహనం పుష్పక విమానం అని తెలిపారు. ఆదిపురుష్ టీజర్ హిందువుల మత విశ్వాసాలను, సంస్కృతి, చరిత్ర, నాగరికతలను దెబ్బతీసే విధంగా ఉందని ఆరోపించారు. 

కాగా, 'ఆది పురుష్' 3 డీ వెర్షన్ టీజర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. శుక్రవారం రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రధాన థియేటర్లలో టీజర్ ను ప్రదర్శించారు. బిగ్ స్క్రీన్ మీద డిఫరెంట్ ఎక్స్పీరియర్స్ ఇచ్చిందని ప్రేక్షకులు అంటున్నారు. ఈ చిత్రం వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 12న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు.