న్యూఢిల్లీ: నాగాలాండ్లో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్ఎస్పీఏ)ను పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరో ఆరు నెలల పాటు ఆ చట్టాన్ని పొడిగిస్తున్నట్లు గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం నాగాలాండ్లో గందరగోళ, ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని, అందుకే ఈ చట్టం గడువును పెంచినట్లు కేంద్రం పేర్కొంది. అక్కడ పౌరులకు సాయంగా సాయుధ బలగాల అవసరం ఉందని చెప్పింది. నాగాలాండ్లోని మోన్ జిల్లాలో డిసెంబర్ 4న విలేజర్స్ వెళ్తున్న బస్సుపై ఆర్మీ జవాన్లు కాల్పులు జరపగా, ఈ ఘటనలో 13 మంది మరణించారు. దీంతో ఏఎఫ్ఎస్పీఏ చట్టాన్ని రద్దు చేయాలని ఆ రాష్ర్ట ప్రజలతో సహా సీఎం నిఫీ రియో డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో ఈ చట్టం రద్దు అంశాన్ని పరిశీలించేందుకు సెంట్రల్ హోం మినిస్ట్రీ కమిటీని కూడా వేసింది. ఏఎఫ్ఎస్పీఏ ప్రకారం.. చట్టానికి విరుద్ధంగా పనిచేసే ఎవరినైనా చంపే అధికారం ఆర్మీ బలగాలకు ఉంటుంది. అలాగే ఎలాంటి వారెంట్ లేకుండా ఎక్కడైనా సెర్చ్ ఆపరేషన్స్ చేయొచ్చు. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే ప్రాసిక్యూషన్ చేసి చర్యలు తీసుకోవచ్చు.