ఎయిరిండియా విమాన ప్రమాదం.. కుట్ర కోణంపై కూడా ఎంక్వైరీ

ఎయిరిండియా విమాన ప్రమాదం.. కుట్ర కోణంపై కూడా ఎంక్వైరీ
  • మూడు నెలల్లో రిపోర్టు: కేంద్ర మంత్రి మురళీధర్​ మొహోల్​ 
  • బ్లాక్​బాక్స్, కాక్​పిట్ వాయిస్​ ..రికార్డర్​ను విశ్లేషిస్తున్న ఏఏఐబీ

న్యూఢిల్లీ: 274 మంది మరణానికి కారణమైన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై కుట్ర కోణంలో కూడా ఎంక్వైరీ చేస్తున్నట్టు కేంద్ర మంత్రి మురళీధర్ మొహోల్ చెప్పారు. ఇది అత్యంత అరుదైన ప్రమాదం కావడంతో అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతున్నదని ఎంక్వైరీ రిపోర్టు మూడు నెలల్లో వస్తుందని తెలిపారు. జూన్ 12న అహ్మదాబాద్‌‌‌‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్‌‌‌‌పోర్టు నుంచి లండన్‌‌‌‌కు బయల్దేరిన ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ డ్రీమ్‌‌‌‌లైనర్ 787-8 విమానం టేకాఫ్ అయిన కొద్ది సెకన్లలోనే సమీపంలోని మెడికల్ కాలేజీ హాస్టల్ క్యాంటీన్​పై కూలిపోయింది. 

ఈ ప్రమాదాన్ని ‘‘అరుదైన ఘటన’’గా పేర్కొన్న కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్​“‘రెండు ఇంజన్లు ఒకేసారి ఆగిపోవడం ఎప్పుడూ జరగలేదు’’ అని చెప్పారు. పైలట్ టేకాఫ్ తర్వాత ‘మేడే’ అనే ఎమర్జెన్సీ కాల్ చేశారని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో కుట్ర కోణం సహా అన్ని దిశల్లో ఎయిర్‌‌‌‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ)  దర్యాప్తు చేస్తున్నది. 

బ్లాక్ బాక్స్, అంటే కాక్‌‌‌‌పిట్ వాయిస్ రికార్డర్, ఫ్లైట్ డేటా రికార్డర్ ప్రస్తుతం ఏఏఐబీ వద్ద ఉన్నాయి. వాటిని విదేశాలకు పంపకుండా ఢిల్లీలోని ల్యాబ్‌‌‌‌లో విశ్లేషిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీని సమీక్షిస్తూ, వివిధ రకాల ఏజెన్సీలు ఈ దర్యాప్తులో పాల్గొంటున్నాయి. “ఇంజన్ లో సమస్య వచ్చిందా? ఇంధన సరఫరాలో లోపం తలెత్తిందా? లేదా ఇతర కారణాలు ఉన్నాయా అనేది నివేదిక వచ్చాక తెలుస్తుంది. మూడు నెలల్లో రిపోర్టు వస్తుంది” అని మురళీధర్ చెప్పారు. ఈ దర్యాప్తులో వివిధ సంస్థలు, దేశాలకు చెందిన నిపుణులు సాంకేతిక సాయం తీసుకుంటున్నారు.