ఉద్యోగాల్లో స్థిరపడిన పిల్లలు తల్లిదండ్రులను ఆనందంగా ఉంచిన రోజున దొరికే తృప్తిని మాటల్లో చెప్పలేం. అచ్చం అలాంటిదే ఎక్స్పీరియెన్స్ చేశాడు ఇతను కూడా. ఆ ఓ స్టోరీ ప్రస్తుతం ట్విట్టర్లో వైరల్ అవుతోంది. ఒకప్పుడు గౌరవ్ సబ్నిస్ కుటుంబం కూడా ఆ కోవకే చెందేది. ప్రస్తుతం అమెరికాలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న గౌరవ్ .. తల్లిదండ్రులు తన దగ్గరికి రావడానికి బిజినెస్ క్లాస్లో ఫ్లైట్ టికెట్లు బుక్ చేశాడు. ఈ సందర్భంగా తన సంతోషాన్ని ఇలా ట్వీట్ చేశాడు. ‘‘మాది మధ్యతరగతి కుటుంబం. నాన్న హైవే బ్రిడ్జి ఇంజినీరుగా పనిచేసేవాడు. దానివల్ల మేం తరచూ ప్రయాణాలు చేయాల్సి వచ్చేది. ఎగుడుదిగుళ్లు, ప్రమాదకరంగా ఉన్న రోడ్ల మీద ఇద్దరు పిల్లలతో కలసి చాలా కష్టంగా జర్నీ చేసేది అమ్మ. అలాంటి పరిస్థితుల్లో కూడా అమ్మ ముఖంలో చిరునవ్వు ఉండేది. అయితే, అలా జర్నీ చేసేటప్పుడు అమ్మ చాలా తక్కువ నీళ్లు తాగేది. అలాగెందుకో అర్థమయ్యేది కాదు. అప్పట్లో పునే నుంచి ఇండోర్ వెళ్లడానికి16 నుంచి 24 గంటల టైం పట్టేది. అన్ని గంటల ప్రయాణంలోనూ అమ్మ నీళ్లు తక్కువ తాగేది. కారణం ఆడవాళ్ల కోసం హైవేల పక్కన టాయిలెట్స్ లేకపోవడమే. ఆ జర్నీ మొత్తంలో బస్సు రెండు, మూడు చోట్ల ఆపేవాళ్లు. అప్పుడు మగవాళ్లు మాత్రం రోడ్ల పక్కన టాయిలెట్కు వెళ్లేవాళ్లు. ఈ విషయంలో మా అమ్మతోపాటు దేశంలోని చాలామంది మహిళలు ఇబ్బంది పడేవాళ్లు. ఆ తర్వాత దాదాపు 15 ఏండ్ల కిందట మా అమ్మ మొదటిసారి అమెరికా వచ్చింది. ఇక్కడ ఏ ప్రాంతానికి వెళ్లినా హైవేల పక్కన ఉండే గ్యాస్ స్టేషన్స్లో టాయిలెట్ వాడుకోవచ్చు. ఆ సౌకర్యం ఉండటం వల్ల మా అమ్మ తనకు దాహం వేసినప్పుడల్లా ధైర్యంగా నీళ్లు తాగేది. అంతేకాదు, ఈసారి విమానంలోని బిజినెస్ క్లాస్లో హాయిగా, కాళ్లు చాపుకొని మరీ అమ్మనాన్నా రావచ్చు” అని తన ఆనందాన్ని ట్విట్టర్లో పంచుకున్నాడు. ఇది చదివి చాలామంది గౌరవ్ను మెచ్చుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు.
