నా కొడుకును ఓడగొట్టండి .. ఓటర్లకు ఏకే ఆంటోనీ పిలుపు

నా కొడుకును ఓడగొట్టండి .. ఓటర్లకు ఏకే ఆంటోనీ పిలుపు

తిరువనంతపురం: కేరళలోని పథనంథిట్ట ఎంపీ స్థానంలో బీజేపీ నుంచి బరిలోకి దిగిన తన కొడుకు అనిల్ కె.ఆంటోనీని ఓడించాలని నియోజకవర్గ ప్రజలకు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆంటో ఆంటోనీని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనిల్ ఆంటోనీ బీజేపీలో చేరిన తర్వాత చాలా రోజులకు ఆయ న మంగళవారం తిరువనంతపురంలో ఈ మేరకు మీడియాతో మాట్లాడారు.

 ఆరోగ్యం సహకరించనందున తాను తిరువనంతపురం నుంచి బయటకు వెళ్లి ప్రచారం చేయలేనని, అయినా ఆంటో ఆంటోనీ పథనంథిట్టలో తప్పకుండా మంచి మెజార్టీతో గెలుస్తాడని ధీమా వ్యక్తం చేశారు. కేరళ స్టూడెంట్స్ యూనియన్ లో పని చేసిన రోజు నుంచీ తాను కుటుంబాన్ని, రాజకీయాలను వేర్వేరుగానే చూశానన్నారు. తనకు కాంగ్రెస్ పార్టీయే మతం అని చెప్పారు. కాగా, ఏకే ఆంటోనీ మీడియా సమావేశంపై అనిల్ ఆంటోనీ స్పందిస్తూ.. కాంగ్రెస్ లో అంతా ఔట్ డేటెడ్ లీడర్లే ఉన్నారని, తన తండ్రిని అడ్డంపెట్టుకుని సింపతీ పొందాలని చూస్తున్నారని అన్నారు.