అక్బరుద్దీన్, సీఎం కేసీఆర్ మధ్య డైలాగ్ వార్

అక్బరుద్దీన్, సీఎం కేసీఆర్ మధ్య డైలాగ్ వార్

హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఎంఐఎం ఎమ్మెల్యే అసదుద్దీన్ ఒవైసీ ప్రభుత్వంపై విమర్శలకు దిగారు. ఈ సందర్భంగా అక్బరుద్దీన్ కు సీఎం కేసీఆర్ కు మధ్య మాటల యుద్ధం జరిగింది. కరోనా పేషెంట్స్ ను కాపాడటానికి తమ ప్రాణాలను అడ్డు పెట్టి సేవలు అందిస్తున్న హెల్త్ వర్కర్స్ గురించి హెల్త్ నోట్ లో పేర్కొనకపోవడం బాధాకరమని ఒవైసీ మండిపడ్డారు. సరిహద్దుల్లో పహారా కాస్తున్న సైనికుల మాదిరిగా మహమ్మారికి ఎదురుగా నిలబడి సేవలు అందిస్తున్న డాక్టర్లు, నర్సులు, శానిటైజేషన్ స్టాఫ్, అంబులెన్స్ డ్రైవర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, పారిశుధ్య కార్మికులు, అంత్యక్రియలు నిర్వహిస్తున్న సిబ్బందికి సెల్యూట్ చేశారు. హెల్త్ వర్కర్స్ ను ప్రశంసిస్తూ హెల్త్ నోట్ లో ఒక్క మాట కూడా లేకపోవడం తీవ్ర బాధాకరమన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ఔచిత్యానికే వదిలేస్తున్నానని పేర్కొన్నారు.

‘కరోనా వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. అలాగే వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయిన కరోనా వారియర్స్ కు నివాళులు అర్పిస్తున్నా. పీఎం కేర్స్, సీఎం రిలీఫ్ ఫండ్స్ కు విరాళాలు అందజేసిన వారికి ఈ నోట్ లో ధన్యవాదాలు చెప్పలేదు. ఆ ఫండ్స్ కు వచ్చిన డబ్బులను ఎలా ఖర్చు చేశారు, ఎక్కడ ఖర్చు చేశారు, వాటిపై ఆడిటింగ్ నిర్వహిస్తారా లేదనేది వేరే విషయం. కరోనా లాక్ డౌన్ టైమ్ లో ముందుకొచ్చి ఆపదలో ఉన్న వారికి, అన్నార్థులకు సాయం అందించిన ఎన్జీవోలు, ఇతర సంస్థలు, ఇండివిడ్యువల్స్ కు మప్పిదాలు చెబుతున్నా. ఈ నోట్ లో వీరి ప్రస్తావనా లేకపోవడం బాధాకరం. ఈ నోట్ ఒక హెల్త్ బులెటిన్ లా ఉంది. కరోనా దేనిపై ప్రభావం చూపిందో వీటిలో లేదు. ఎకానమీ, బిజినెస్, అడ్మినిస్ట్రేషన్, ఇండస్ట్రీస్, ఎడ్యుకేషన్ తోపాటు మన జీవితాలపై కరోనా ప్రభావం చూపలేదా? వీటిలో నుంచి ఏ ఒక్క విషయాన్ని కూడా ఇందులో చేర్చకపోవడం చాలా బాధాకరం. ప్రభుత్వం ఎందుకింత అనుమానాస్పదంగా వ్యవహరిస్తోంది? రిలీఫ్ మెజర్స్ గురించి కూడా చేర్చలేదు. మైగ్రంట్ వర్కర్స్ కు రేషన్ ఇచ్చారు, వారి కోసం స్పెషల్ ట్రెయిన్స్ సౌకర్యం కల్పించారు? మీరు రేషన్, డబ్బులు ఇచ్చారు? వీటి ప్రస్తావనే లేదు’ అని అక్బరుద్దీన్ చెప్పారు.

సర్కార్ ఫెయిలైందంటే ఒప్పుకోం: కేసీఆర్

ఒవైసీ వ్యాఖ్యలపై కేసీఆర్ అభ్యంతరం తెలిపారు. ‘హెల్త్ మినిస్టర్ ఇచ్చిన వివరాలు సభకు సరిపోతాయి. ఆయన అడిగినంత చెప్పాలంటే మహాభారతమంత సమాచారం అవుతుంది. ప్రభుత్వం తీసుకున్న చర్యలకు సంబంధించిన వివరాలు కావాలంటే పంపిస్తాం. రోజూ పేపర్ లో వీటి గురించి వస్తూనే ఉంటుంది. ఎందుకంత ఆవేశం? ప్రభుత్వం విఫలమైందంటే ఎలా? దేశంలో అందరికంటే ముందే హెల్త్ వర్కర్స్ కు మేం ఇన్ సెంటివ్స్ అందించాం. అవసరమైనప్పుడు వివరాలు అందజేస్తాం. వారికి కావాలంటే ఇస్తాం. కానీ సర్కార్ ఫెయిల్ అయిందంటే మాత్రం ఒప్పుకోం’ అని కేసీఆర్ పేర్కొన్నారు.