
బంగాళాకాటంలో ఏర్పడ్డ ద్రోణి ప్రభావంతో తెలంగాణలో పలు చోట్ల మోస్తరు వర్షాలు పడుతున్నాయి. వచ్చే 48 గంటలు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది వాతావరణశాఖ. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో వచ్చే 2 రోజులు భారీ వర్షాలు పడతాయని అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలతో పాటు, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది.
హైదరాబాద్ సిటీలో ముసురు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది వాతావరణశాఖ. 2 రోజులుగా నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో అత్యథిక వర్షపాతం నమోదయింది. ఇక హైదరాబాద్ లో నిన్నంతా ఎడతెరిపి లేకుండా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.
గ్రేటర్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, పలు కాలనీలు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు GHMC అధికారులు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి మూసీలో వరద పెరిగింది. వర్షాలతో హుస్సెన్ సాగర్ దాదాపు పూర్తిస్థాయికి చేరటంతో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు అధికారులు.రాష్ట్రంలో భారీ వర్షాలతో అధికారులను అప్రమత్తం చేసింది ప్రభుత్వం. ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది.