ముంబై: దేశంలో లాక్డౌన్ మే 3 వరకు పొడిగించడంతో స్టాక్ మార్కెట్లు మరింతగా నష్టపోతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయినప్పటికి ఏప్రిల్ 20 నుంచి ఎకనామిక్ యాక్టివిటీ ప్రారంభమవుతుందనే అంచనాలు మార్కెట్లకు కొంత మద్ధతుగా ఉంటాయని తెలిపారు. ‘మార్కెట్లు బుధవారం సెషన్లో ఎంత నష్టంలో ప్రారంభమవుతాయో చెప్పడం కష్టం. కానీ మార్కెట్ పార్టిసిపేషన్ తగ్గే అవకాశం ఉండడంతో ట్రేడింగ్ వాల్యుమ్లు తగ్గుతాయి’ అని కేఆర్ చోక్సి ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ ఎండీ దెవాన్ చోక్సి అన్నారు. రూరల్ ప్రాంతాలలో వ్యవసాయ పనులు జరుగుతుండడం ఎకానమీకి సాయపడేదని అభిప్రాయపడ్డారు. కరోనా దెబ్బతో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు సెన్సెక్స్ 25.61 శాతం, నిఫ్టీ 26.09 శాతం వరకు నష్టపోయాయి.
ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐ) 6.6 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను అమ్మేశారు. కాగా ప్రభుత్వం స్టిములస్ ప్యాకేజిలను ప్రకటిస్తుండడంతో మార్కెట్లలో కొంత వొలటాలిటీ కొనసాగుతోందని విశ్లేషకులు తెలిపారు.లాక్డౌన్ పొడిగింపు ఉంటుందని మార్కెట్ వర్గాలు ముందు నుంచే అంచనా వేస్తున్నారని యెస్ సెక్యురిటీస్ సీనియర్ ప్రెసిడెంట్ అమర్ అంబానీ అన్నారు. దీని ప్రభావం మార్కెట్లపై తీవ్రంగా ఉంటుందని అనుకోవడం లేదన్నారు. గ్లోబల్గా కరోనా కేసులు పెరుగుతుండడం, రికవరి అయిన వాళ్లు కూడా టెస్ట్లలో పాజిటివ్గా తేలుతుండడంతో మార్కెట్లు ఒత్తిడిలోనే ట్రేడవుతాయని అన్నారు. ప్రభుత్వం స్టిమ్యులస్ ప్యాకేజితో ముందుకొస్తుందనే అంచనాలు మార్కెట్ వర్గాలలో పెరిగాయని తెలిపారు. ప్రభుత్వం తొందరగా స్టిములస్ ప్యాకేజిని ప్రకటిస్తే స్టాక్ మార్కెట్ల పతనం ఆగుతుందని చెప్పారు. లాక్డౌన్ పొడిగింపు మార్కెట్లను నిరుత్సాహపరచక పోవచ్చని ఇండిపెండెంట్ ఎనలిస్ట్ అంబరీష్ బలిగ అన్నారు. భవిష్యత్లో మరింత నష్టపోకుండా ఉండడానికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుందన్నారు. కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు మనం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రధాన మంత్రి ప్రకటనకు ముందే కొన్ని రాష్ట్రాలలో లాక్డౌన్ పొడిగింపు జరగడంతో మార్కెట్లపై దీని ప్రభావం తీవ్రంగా ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు