భారత్ యాంటీ షిప్ మిసైల్ (ASHM) ను పరీక్షించింది. బంగాళాఖాతంలో యుద్ధనౌక INS కోర నుంచి ఇండియన్ నేవీ ఈ ప్రయోగం చేపట్టింది. నిర్దేశిత లక్ష్యాన్ని క్షిపణి సులువుగా ఛేదించిందని తెలిపింది. క్షిపణి ఢీ కొట్టడంతో లక్షిత నౌక ముక్కలు ముక్కలుగా అవడంతో పాటు నౌక మంటల్లో పూర్తిగా కాలిపోయిందని నేవీ అధికారులు తెలిపారు.
భారత్-చైనా మధ్య ఉద్రిక్తతల క్రమంలో భారత్ ఇటీవల వరుసగా క్షిపణి ప్రయోగాలను వేగవంతం చేసింది. అత్యంత సమర్థవంతమైన క్షిపణులను దేశీయంగా తయారు చేయడంపై దృష్టి పెడుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల ఒడిశా తీరంలోని వీలర్ ఐలాండ్లో ఏపీజే అబ్దుల్ కలాం లాంచ్ కాంప్లెక్స్ నుంచి హైపర్సోనిక్ టెక్నాలజీ డెమానిస్ట్రేటర్ వెహికల్ను ప్రయోగించింది. ఆ తర్వాత బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి, అణు సామర్థ్యం కలిగిన శౌర్య సూపర్ సోనిక్ క్షిపణి, జలాంతర్గాములను ధ్వంసం చేయగల క్షిపణి సహాయక టోర్పెడో, లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ క్షిపణులను భారత్ వరుసగా ప్రయోగించింది.