హైదరాబాద్, వెలుగు: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) దరఖాస్తు గడువు బుధవారం సాయంత్రంతో ముగియనున్నది. మంగళవారం సాయంత్రం నాటికి 2,50,963 మంది టెట్కు అప్లై చేసుకున్నారు. వారిలో 74,026 మంది పేపర్ 1కి, 16,006 మంది పేపర్2కు అప్లై చేయగా, రెండు పేపర్లకూ 1,60,931 మంది దరఖాస్తు చేశారు. కాగా, మొత్తం 2,59,123 మంది అభ్యర్థులు ఫీజు చెల్లించారు. చివరి రోజు మరో 50 వేల మంది అప్లై చేసుకునే చాన్స్ ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు.
ఈ సారి కూడా 33 జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. అప్లికేషన్లు ఎక్కువగా రావడంతో ఇప్పటికే హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, ఆదిలాబాద్, కుమ్రం భీమ్, నిర్మల్ జిల్లాల్లోని సెంటర్లను బ్లాక్ చేశారు. దీంతో హైదరాబాద్లో పరీక్ష రాయాలనుకునే వాళ్లు ఇతర ప్రాంతాలను ఎంపిక చేసుకోవాల్సి వస్తోంది. మరోపక్క దరఖాస్తు గడువు పెంచాలని, అప్లికేషన్లకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు.