- 119 నియోజకవర్గాలకు జాబితా విడుదల చేసిన కేసీఆర్
- ఈసారి పూర్తిగా డిజిటల్ పద్ధతిలోనే సభ్యత్వాల స్వీకరణ.. యాప్కు తుది మెరుగులు
- తెలంగాణ భవన్లో ఇన్చార్జీలకు, ఐటీ నిపుణులకు ప్రత్యేక డిజిటల్ శిక్షణ
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ప్రక్రియకు సంబంధించి రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ అధినేత కేసీఆర్ ఇన్చార్జీలను నియమించారు. ఈ మేరకు గురువారం ఆయన ఇన్చార్జీల పూర్తి జాబితాను విడుదల చేశారు. ఈసారి సభ్యత్వ నమోదు ప్రక్రియను పూర్తిగా డిజిటల్ విధానంలో చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. డిజిటల్ సభ్యత్వ నమోదు కోసం ప్రత్యేకంగా రూపొందిస్తున్న మొబైల్ యాప్కు ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతున్నారు.
ఈ ప్రక్రియపై నియోజకవర్గాల ఇన్చార్జీలతో పాటు ప్రతి నియోజకవర్గానికి ఒకరు చొప్పున ఎంపిక చేసిన ఐటీ నిపుణులకు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ప్రత్యేకంగా డిజిటల్ శిక్షణ ఇవ్వనున్నారు. తెలంగాణ భవన్లో శిక్షణ పూర్తయిన తర్వాత, ఆయా జిల్లాల్లోని బీఆర్ఎస్ కార్యాలయాల్లో పార్టీ ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గాల ఇన్చార్జీల ఆధ్వర్యంలో తదుపరి శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయి.
నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ల సంఖ్యను బట్టి, ప్రతి బూత్కు ఇద్దరు చొప్పున కార్యకర్తలను ఎంపిక చేసి నిర్ణయించిన తేదీల్లో వారం రోజుల పాటు ఈ శిక్షణ శిబిరాలను నిర్వహించనున్నారు. ఈ డిజిటల్ సభ్యత్వ నమోదు శిక్షణ అంతా ముగిసిన వెంటనే, రాష్ట్రవ్యాప్తంగా సభ్యత్వ నమోదు ప్రారంభమయ్యే అధికారిక తేదీలను పార్టీ అధిష్ఠానం ప్రకటించనుంది.
