గణేష్ ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు

గణేష్ ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు

మరో వార రోజుల్లో గణేష్ చతుర్థి రాబోతున్న వేళ ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఖైరతాబాద్ గణేష్ మండపం వద్ద ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి.. ఇక్కడ నిలకొల్పే గణపతికి దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. లక్షలాది మంది వివిధ ప్రాంతాల నుండి దర్శనం కోసం వస్తుంటారని చెప్పారు. భక్తులు, నిర్వాహకులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తుందని తెలిపారు. ఖైరతాబాద్ వెనుక భాగంలో నివాసం ఉంటున్న వారికి ప్రత్యామ్నాయంగా ఐ మాక్స్ థియేటర్ ఉన్న ట్రాఫిక్ పీఎస్ పక్క నుంచి రహదారి ఏర్పాటు చేస్తున్నామన్నారు. 

ఈ సంవత్సరం 6 లక్షల మట్టి విగ్రహాల పంపిణీ చేయడం జరుగుతుందని మంత్రి తలసాని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. మినీ ఇండియాగా పిలవబడే హైదరాబాద్ నగరంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు బాధాకరమన్న ఆయన.. కొంతమంది కావాలనే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.  ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని కోరారు. ఓ మంత్రిగా కాకుండా, హైదరాబాద్ నగర వాసుడిగా జరుగుతున్న ఘటనలను ఖండిస్తున్నానని మంత్రి తలసాని వ్యాఖ్యానించారు.