ఆర్టీసీ కార్మికులు ఎవరూ తీవ్ర చర్యలకు పాల్పడవద్దని.. ఆవేశంలో ఉద్రేకానికి లోనయ్య ఆత్మహత్యా ప్రయత్నాలు చేసుకోవద్దని పిలుపునిచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కేబినెట్ భేటీలో చర్చించామని.. సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారాయన.
ఉద్రేకంలో.. భయంతో.. ఆవేశంలో కార్మికులు తీవ్ర చర్యలకు పాల్పడితే.. కుటుంబాలకు అన్యాయం చేసినోళ్లు అవుతారని.. ఎవరూ ఆత్మహత్యా ప్రయత్నాలకు దిగవద్దని సూచించారు మంత్రి కోమటిరెడ్డి. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ సమ్మె చాలా చాలా పెద్దదని.. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారాయన.
►ALSO READ | కేబినెట్ భేటీ: ఆర్టీసీ సమ్మెపై మంత్రుల కీలక ప్రకటన
ఆర్టీసీ కార్మికులు ఎవరూ ఆత్మ బలిదానాల ఆలోచనలను విరమించుకోవాలని.. అలాంటి ఆలోచనల వల్ల కుటుంబాలు వీధిన పడతాయని.. కార్మికుల న్యాయమైన డిమాండ్లు అన్నింటినీ అంగీకరిస్తామని స్పష్టం చేశారు మంత్రి. ఇది ప్రజా ప్రభుత్వం అని.. సమస్యలు అన్నింటినీ ప్రభుత్వం వింటుందని.. మీ కుటుంబాలను గుర్తు చేసుకుని సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు మంత్రి కోమటిరెడ్డి.
ఆత్మహత్యాయత్నం చేసిన కార్మికుడు త్వరగా కోలుకోవాలని.. అతనికి కావాల్సిన వైద్య సాయం అంతా ప్రభుత్వం దగ్గరుండి చూసుకుంటుందని భరోసా ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి.

