జూన్ 22 నుంచి బోనాలు... జాతరకు రూ. 15 కోట్లు

జూన్ 22 నుంచి బోనాలు...  జాతరకు రూ. 15 కోట్లు

హైదరాబాద్‌లో ఆషాడ బోనాల తేదీలు ఖరారయ్యాయి. 2023జూన్ 22న గోల్కొండ కోటలోని జగదాంబికా మహంకాళి అమ్మవారికి తొలిబోనంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. ఈ ఏడాది బోనాల పండగ కోసం రూ. 15 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.  హైదరాబాద్‌ బేగంపేటలోని హరిత ప్లాజాలో బోనాల ఏర్పాట్లపై మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి, మల్లారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. 

జూన్ 22న గోల్కొండలో ఆషాడ బోనాలు ప్రారంభమవుతాయని, జులై 9న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, జూన్ 10న రంగం నిర్వహిస్తామని మంత్రి తలసాని తెలిపారు.  జులై 16న ఓల్డ్ సిటీ బోనాలు, 17న ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో ఊరేగింపు జరగనుందన్నారు.  బోనాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 కోట్లు కేటాయించిందని మంత్రి తెలిపారు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల ఉత్సవాలను సీఎం కేసీఆర్‌.. రాష్ట్ర పండుగగా ప్రకటించారని మంత్రి తలసాని  చెప్పారు. తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు.