- అస్సాం అంతటా కొనసాగనున్న రాత్రి పూట కర్ఫ్యూ
పది రోజులుగా కరోనా కేసులు పెరగడంతో అస్సాం సర్కార్ గౌహతిలో రెండు వారాల పాటు లాక్డౌన్ విధించింది. ఆదివారం అర్థరాత్రి నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకు ఈ లాక్డౌన్ కొనసాగనుంది. లాక్డౌన్ టైమ్లో ఫార్మసీలు, హాస్పిటిల్స్ మాత్రమే తెరవనున్నట్టు రాష్ట్ర హెల్త్మినిస్టర్ హిమంత బిశ్వ శర్మ శుక్రవారం చెప్పారు. లాక్ డౌన్ను దృష్టిలో ఉంచుకుని ఆదివారంలోగా షాపింగులు పూర్తిచేసుకోవాలని జనాన్ని ఆయన కోరారు. “మొదటి వారం రోజులు కేవలం ఫార్మసీలు, హాస్పిటిల్స్ మాత్రమే ఓపెన్ అవుతాయి. మిగతావన్నీ బంద్ అవుతాయి” అని ఆయన చెప్పారు. శుక్రవారం నుంచి రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో మాత్రం 12 గంటల కర్ఫ్యూ ( రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 వరకు) కొనసాగుతుందన్నారు. వీకెండ్ రోజుల్లో మిగతా టౌన్లు, మున్సిపల్ ఏరియాల్లో పూర్తిస్థాయి లాక్డౌన్ అమల్లో ఉంటుందని ఆయన చెప్పారు. ఎమర్జెన్సీ సర్వీసులకు మాత్రమే అనుమతి ఉంటుందని మంత్రి తెలిపారు.
గౌహతి సిటీలో బ్యాంకులు కొన్ని గంటలు మాత్రమే పనిచేస్తాయి. ప్రయాణాలు చేసేవారు ఎయిర్ లేదా రైలు టికెట్లను పాస్ లుగా చూపించాల్సి ఉంటుందని మంత్రి చెప్పారు. అవసరాన్ని బట్టి సడలింపులు ఇవ్వాలా? వద్దా? అన్నదానిపై వచ్చే శుక్రవారం రివ్యూ చేస్తామని ఆయన చెప్పారు. జూన్ 15 నుంచి గౌహతి సిటీలో 700 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. నార్త్ఈస్ట్ రాష్ట్రాల్లో కరోనా ప్రభావం అస్సాంలోనే ఎక్కువగా ఉంది.
వచ్చే వారం నుంచి గుర్గావ్లో మాల్స్ రీఓపెన్
హర్యానాలోని గుర్గావ్లో షాపింగ్మాల్స్ వచ్చేవారం నుంచి తెరవనున్నారు. కరోనా వ్యాప్తి కారణంగా దాదాపు 3 నెలలపాటు మాల్స్ మూతపడ్డాయి. మాల్స్కు వచ్చేవారు మాత్రం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపీ) తప్పకుండా పాటించాలని అధికారులు చెప్పారు. గుర్గావ్లోని ప్రార్థనా స్థలాల్ని మాత్రం మూసే ఉంచుతారు. సౌత్ఢిల్లీకి దగ్గర్లో ఉన్న ఈ సిటీలోని కంటైన్మెంట్ జోన్లకు సంబంధించిన గైడ్లైన్స్ ను తర్వాత ప్రకటించనున్నారు.
రేపటి నుంచి మహారాష్ట్రలో సెలూన్లు రీఓపెన్
మహారాష్ట్రలోని రెడ్ జోన్లలో (ముంబై సహా )ని అన్ని సెలూన్లు, బ్లూటీ పార్లర్లను ఈనెల 28 నుంచి ఓపెన్ చేయనున్నారు. ముందుగా అపాయింట్మెంట్ తీసుకున్నవారికి మాత్రమే దీంట్లో ఎంట్రీ ఉంటుందని సర్కార్ నోటిఫికేషన్లో పేర్కొంది.
జులై 15 వరకు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ బంద్
వచ్చేనెల 15 వరకు కమర్షియల్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ సర్వీసులుండవని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) శుక్రవారం ప్రకటించింది. సరకు రవాణా, ప్రత్యేకంగా అనుమతి పొందిన విమానాలకు మాత్రం ఎలాంటి ఆంక్షలు ఉండవని తెలిపింది. కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు మార్చి 24న లాక్ డౌన్ ప్రకటించడంతో అన్ని ప్యాసింజర్ ఫ్లైట్లను నిలిపివేశారు. లాక్ డౌన్ సడలింపులతో డొమెస్టిక్ ఫ్లైట్స్ మే 25 నుంచి మొదలయ్యాయి. కరోనా కేసులు కంట్రోల్ లోకి వస్తే జులైలో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ సర్వీసుల్ని ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకుంటామని సివిల్ ఏవియేషన్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పురి గతవారం చెప్పారు.
బెంగళూరులో లాక్డౌన్ ఉండదు: సీఎం యడ్యూరప్ప
బెంగళూరులో మళ్లీ లాక్డౌన్ విధించబోమని కర్నాటక సీఎం బీఎస్ యడ్యూరప్ప స్పష్టం చేశారు. బెంగళూరులో కరోనా తీవ్రత తగ్గించడానికి తీసుకోవాల్సిన అన్ని చర్యలనూ చేపడుతున్నామన్నారు. గాడిలో పడుతున్న రాష్ట్ర ఎకానమీ కూడా తమకు ముఖ్యమన్నారు. బెంగళూరులో గత కొద్ది రోజుల్లోనే కరోనా కేసుల సంఖ్య బాగా పెరిగిందని, అందరూ సహకరిస్తే మహమ్మారిని కంట్రోల్ చేయొచ్చన్నారు. ‘మళ్లీ లాక్డౌన్ ప్రశ్నే లేదు. కేసులు ఎక్కువగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే లాక్డౌన్ను అమలు చేస్తున్నాం. ఆ ఏరియాలను మినహాయిస్తే మిగిలిన ప్రాంతాల్లో లాక్డౌన్ పెట్టడానికి ఆస్కారం లేదు. మా పార్టీతోపాటు ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో సహా మంత్రులతోనూ చర్చించి ఓ నిర్ణయానికి వచ్చాం. వారి సాయంతో బెంగళూరులో మహమ్మారిని కంట్రోల్ చేయడానికి శక్తి వంచన లేకుండా అన్ని విధాలా యత్నిస్తాం’ అని యడ్యూరప్ప చెప్పారు. కరోనా కంట్రోల్పై ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో శుక్రవారం ఆల్పార్టీ మీటింగ్జరిగింది.