కరోనా టెస్ట్ రిపోర్టుతోనే అసెంబ్లీకి రావాలి

కరోనా టెస్ట్ రిపోర్టుతోనే అసెంబ్లీకి రావాలి

హైద‌రాబాద్ : కరోనా పరీక్షల్లో పాజిటివ్ వస్తే అసెంబ్లీకి రావద్దని సూచించారు శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాల్లో తీసుకోవాల్సిన కరోనా జాగ్రత్తలపై శుక్రవారం ప్రెస్ మీట్ లో మాట్లాడారు పోచారం. ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు జ‌ర‌గ‌బోతున్నాయ‌ని..  స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌తో పాటు అధికారులు, సిబ్బంది, పోలీసులు, మీడియా ప్ర‌తినిధులు, మంత్రుల పీఎస్‌లు, పీఏలు త‌ప్ప‌నిస‌రిగా కొవిడ్ ప‌రీక్ష‌లు చేయించుకోవాలన్నారు. కొవిడ్ పాజిటివ్ తేలితే అసెంబ్లీ ప్రాంగ‌ణంలోకి రావద్ద‌ని స్పీక‌ర్ రిక్వెస్ట్ చేశారు. మాస్కు ఉంటేనే స‌భ‌లోకి అనుమ‌తి ఉంటుంద‌ని.. జ్వ‌రం, జ‌లుబు, ద‌గ్గు వంటి ల‌క్ష‌ణాలు ఉంటే అసెంబ్లీ ప్రాంగ‌ణంలోకి అనుమ‌తించరన్నారు. శ‌రీర ఉష్ణోగ్ర‌త‌లు సాధార‌ణంగా ఉంటేనే అనుమ‌తి ఉంటుంద‌ని తెలిపారు స్పీకర్.

20 నుంచి 21 రోజులు సభ నడువొచ్చు అనుకుంటున్నామని.. అసెంబ్లీకి వచ్చే వాళ్ళు తమ బంధువుల ఫంక్షన్‌లు, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లకుండా చూసుకోవాలన్నారు. అసెంబ్లీ నుంచి ఇంటికి ఇంటినుంచి అసెంబ్లీకి వచ్చే విధంగా చూసుకోవాలని.. ప్రభుత్వం తరుపున శాసన సభ్యులు, మండలి సభ్యులకు కిట్ ఇస్తున్నామని చెప్పారు. అందులో ఆక్సి మీటర్, శానిటైజేర్ ఇస్తున్నామని.. ఆక్సిజన్ పర్సెంటేజ్ 90 లోపు ఉంటే సభకు రావొద్దని… ఈ సెషన్‌కు విజిటర్స్‌కు అనుమతి లేదని తెలిపారు పోచారం.

స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి సీఎస్ సోమేశ్ కుమార్‌, ఉన్న‌తాధికారులు, పోలీసుల‌తో చ‌ర్చించామ‌న్నారు. గ‌త స‌మావేశాలు వేరు, కొవిడ్ స‌మ‌యంలో జ‌రుగుతున్న ఈ స‌మావేశాలు వేరు అని స్పీక‌ర్ అన్నారు. క‌రోనా నుంచి ఇంకా బ‌య‌ట‌ప‌డ‌లేదు. సీఎం కేసీఆర్ త‌గు చ‌ర్య‌లు తీసుకోవ‌డం వ‌ల్ల రాష్ర్టంలో మ‌ర‌ణాల సంఖ్య త‌గ్గింద‌న్నారు. కొవిడ్ బారిన ప‌డే వారి సంఖ్య ఇత‌ర రాష్ర్టాల‌తో పోలిస్తే మ‌న రాష్ర్టంలో ఆ సంఖ్య త‌గ్గింద‌ని తెలిపారు. స‌మావేశాల‌కు వ‌చ్చే వారంద‌రూ పూర్తిగా అప్ర‌మ‌త్తంగా ఉండి, క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని స్పీక‌ర్ సూచించారు.

సమావేశాలు ప్రారంభం అయ్యేలోపు కరోనా టెస్ట్ లు చేయించుకొని అసెంబ్లీకి రావాలని.. ఎమ్మెల్యేలతో సహా ఎవరికి పాజిటివ్ వచ్చినా అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతి ఉండదన్నారు. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యే లు టెస్ట్ లు చేయించుకున్నారని.. మిగతా ఎమ్మెల్యేల వద్దకు డాక్టర్ లు వెళ్తారని.. టెస్టు లు చేయించుకొని రిపోర్ట్ తీసుకునే అసెంబ్లీకి రావాలన్నారు పోచారం. ఎమ్మెల్యేల పీఏ లకు అనుమతి లేదని.. మంత్రుల పీఏలకు అనుమతి ఉందని తెలిపారు. సభ ఎంట్రెన్స్ లోనే థర్మల్ టెస్టింగ్, సానిటైజర్ అందుబాటులో ఉంటుందని.. బయట అంబులెన్స్ లు, డాక్టర్లు, సిబ్బందితో పాటు ఆక్సిజన్ కూడా అందుబాటులో ఉంచుతామన్నారు. శాసన సభ్యులు సభ గౌరవాన్ని కాపాడాలని, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సభా సమయాన్ని సద్వినియోగ పర్చుకుందామన్నారు. పార్లమెంటులో అమలు చేస్తున్న కోవిడ్ నిభందనలే.. ఇక్కడ అమలు చేస్తున్నామని తెలిపారు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.