కూతుర్ని ప్రేమించాడని మేనల్లుడిని చంపిన మామ

కూతుర్ని  ప్రేమించాడని మేనల్లుడిని చంపిన మామ

దండేపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం గ్రామంలో దారుణం జరిగింది. కూతురును ప్రేమించాడన్న కోపంతో మేనల్లుడిని అతని మామ కత్తితో బెదిరించి గడ్డిమందు కలిపిన బీర్​ను తాగించాడు. బాధిత యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందగా, పోలీసులు నిందితుడిని మంగళవారం రాత్రి అరెస్ట్​ చేశారు. లక్సెట్టిపేట సీఐ కృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, గూడెం గ్రామానికి చెందిన దుడ్డంగుల అనిల్(22), అదే గ్రామానికి చెందిన తన మేనమామ దారంగుల రాజమౌళి కూతురు ప్రేమించుకున్నారు. ఇది తెలిసిన రాజమౌళి ఈ నెల 14 న మాట్లాడేది ఉంది రమ్మని చెప్పి అనిల్​ను లక్షెట్టిపేట శివారులోని   టేకుచెట్ల దగ్గరకు తీసుకెళ్లాడు. ముందుగా ఒక బీరు తాగించాడు. తర్వాత  గడ్డిమందు కలిపిన బీరు​ను ఇచ్చి తాగాలని కత్తితో బెదిరించాడు.

దీంతో అనిల్ ఆ బీర్ తాగి  స్పృహ తప్పగానే రాజమౌళి అక్కడి నుంచి పరారయ్యాడు. స్పృహ కోల్పోయిన అనిల్ ఎట్టకేలకు తన ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులకు విషయం చెప్పాడు. వెంటనే హాస్పిటల్​కు తరలించగా చికిత్స పొందుతూ ఈ నెల 16న చనిపోయాడు. అనిల్​ తండ్రి శంకర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసి నిందితుడు రాజమౌళిని అరెస్టు చేసినట్టు సీఐ తెలిపారు.