హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభజనపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. సోమవారం (ఏప్రిల్ 27) తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకల్లో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ విభజనపై లోక్ సభలో వివాదస్పదమైన కామెంట్స్ చేసిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ఓ వెధవ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
సభలో తెలంగాణ ఏర్పాటుపై నోటికి వచ్చినట్లుగా మాట్లాడుంటే కనీసం అడ్డుపడని బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు దద్దమ్మలు అని విమర్శించారు. అదే బీఆర్ఎస్ ఎంపీలు సభలో ఉండి ఉంటే రణరంగం సృష్టించేవాళ్లమని కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీలు లేని లోటు స్పష్టంగా కనిపించిందని.. తెలంగాణ పట్ల బీఆర్ఎస్కు ఉన్న చిత్తశుద్ధి ఎవరికి ఉండదని అన్నారు.
లోక్ సభలో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చడం తీవ్ర దుమారం రేపింది. తేజస్వీ వ్యాఖ్యలను బీఆర్ఎస్, కాంగ్రెస్ తీవ్రంగా ఖండించగా.. బీజేపీ మాత్రం ఆయన వ్యాఖ్యలను సమర్ధించింది. ఈ క్రమంలోనే తేజస్వీ వ్యాఖ్యలపై గులాబీ బాస్ కేసీఆర్ పై విధంగా రియాక్ట్ అయ్యారు.

