తెలంగాణలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సైబర్ కేటుగాళ్లు తమ మోసాలకు ఆసరాగా మలుచుకుంటున్నారు. ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తామంటూ అమాయక ప్రజలను మోసగించేందుకు కొత్త దారులు తొక్కుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలను తీవ్రంగా అప్రమత్తం చేస్తున్నారు.
డబ్బులు కడితే వెంటనే ఇల్లు మంజూరు చేయిస్తామని చెప్పే కేటుగాళ్ల మాటలను ఎవరూ నమ్మవద్దని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా రూ.10 వేల ఈఎండీ (EMD) చెల్లింపుల పేరుతో భారీగా మోసాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. దళారులు, మధ్యవర్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని సూచిస్తున్నారు.
నకిలీ ఫోన్ కాల్స్, అనుమానాస్పద లింకులు, ఏపీకే (APK) ఫైల్స్ ద్వారా అమాయకుల బ్యాంక్ ఖాతాలను క్షణాల్లో ఖాళీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జాగ్రత్తలు
- AnyDesk, TeamViewer వంటి స్క్రీన్ షేరింగ్ యాప్లను ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్లోడ్ చేయవద్దు.
- రిఫండ్ పేరుతో వచ్చే ఫోన్లకు UPI PIN లేదా OTP చెప్పాల్సిన అవసరమే లేదని గుర్తుంచుకోండి.
- ఆధార్ కార్డ్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలు, పాస్వర్డ్లు, ఓటీపీలను అపరిచితులతో అసలు పంచుకోవద్దు.
- ఒకవేళ మీరు లేదా మీ చుట్టుపక్కల వారు ఎవరైనా ఈ సైబర్ మోసానికి గురైతే.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నంబర్ 1930 కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.
