రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అయ్యప్ప భక్తులు మృతి చెందారు. ఈ విషాద ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. డిసెంబర్ 17వ తేదీ ఆదివారం మధ్యాహ్నం.. శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకుని తిరిగి కేరళ నుంచి వస్తుండగా తమిళనాడులోని మధురై సమీపంలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ముగ్గురు అయ్యప్ప భక్తులు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స కోసం వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ప్రాణాలు కోల్పోయిన అయ్యప్ప భక్తులను.. తెలంగాణలోని ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.