ఢాకా: బంగ్లాదేశ్ క్రికెటర్ల సమ్మె ముగిసింది. తమ డిమాండ్లను పరిష్కరించేందుకు బంగ్లా క్రికెట్ బోర్డు (బీసీబీ) అంగీకారం తెలిపిందని, దాంతో తక్షణమే తాము సమ్మె విరమిస్తున్నట్టు స్టార్ క్రికెటర్ షకీబల్ హసన్ బుధవారం రాత్రి ప్రకటించాడు. శనివారం నుంచి తామంతా మళ్లీ మైదానంలోకి వస్తామని తెలిపాడు. అంతకుముందు బీసీబీ, బంగ్లా క్రికెటర్ల మధ్య సుదీర్ఘ చర్చలు నడిచాయి. టెస్ట్, టీ20 కెప్టెన్ అయిన షకీబల్తో పాటు పలువురు సీనియర్లు బీసీబీ ఆఫీసులో జరిగిన చర్చల్లో పాల్గొన్నారు. రాత్రి 10.30 సమయంలో షకీబల్తో కలిసి మీడియా ముందుకు వచ్చిన బీసీబీ ప్రెసిడెంట్ నజ్ముల్ హసన్ క్రికెటర్ల 11 డిమాండ్లను అంగీకరిస్తున్నట్టు వెల్లడించారు. అయితే, అంతకుముందే ఆటగాళ్లు మరో రెండు డిమాండ్లు బోర్డు ముందుంచారు. బీసీబీకి వచ్చే ఆదాయంలో తమకు వాటా ఇవ్వడంతో, మహిళా క్రికెటర్లకు కూడా తగిన వేతనాలు అందించాలన్నారు. అయితే, వీటి గురించి ఆలోచించేందుకు తమకు కొంత సమయం కావాలని నజ్ముల్ తెలిపారు.


