
- ప్రభుత్వ రంగ బ్యాంకులపై ఎక్కువ ప్రభావం
- వెల్లడించిన ఆర్బీఐ రిపోర్ట్
ముంబై: బ్యాంకు మోసాలు 2024–25 ఆర్థిక సంవత్సరంలో మూడు రెట్లు పెరిగాయని రిజర్వ్ బ్యాంక్ గురువారం వెల్లడించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 122 కేసులను తిరిగి వర్గీకరించడం వల్ల వీటి సంఖ్య మరింత ఎక్కువయిందని తెలిపింది. 2024 ఆర్థిక సంవత్సరంలో మోసాల విలువ రూ. 12,230 కోట్ల నుంచి 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 36,014 కోట్లకు పెరిగింది. మోసాల కేసుల సంఖ్య 2024 ఆర్థిక సంవత్సరంలో 36,060 నుంచి 2025 ఆర్థిక సంవత్సరంలో 23,953కు తగ్గింది.
మోసాలు ప్రధానంగా డిజిటల్ చెల్లింపుల విభాగంలో, లోన్ పోర్ట్ఫోలియో లేదా అడ్వాన్స్ల విభాగంలో ఎక్కువగా ఉన్నాయి. అరవై శాతం మోసాలు ప్రైవేట్ రంగ బ్యాంకుల్లోనే జరిగాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీలు) వాటా విలువ పరంగా 2025 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 71 శాతానికి పైగా ఉంది. ప్రైవేట్ రంగ బ్యాంకులు వెల్లడించిన మోసాల్లో కార్డు/ఇంటర్నెట్ మోసాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులలో మోసాలు ప్రధానంగా లోన్ పోర్ట్ఫోలియోలో ఉన్నాయి. అడ్వాన్స్లకు సంబంధించిన మోసాలు సంఖ్యాపరంగా 33 శాతానికి పైగా, విలువ పరంగా 92 శాతానికి పైగా ఉన్నాయి.
2025 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి కార్డు, ఇంటర్నెట్ మోసాల విభాగంలో 13,516 మోసాలు జరిగాయి. ఇవి మొత్తం 23,953 మోసాలలో 56.5 శాతానికి సమానం. ఈ డేటా 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. లక్ష, అంతకంటే ఎక్కువ మోసాలకు సంబంధించినది. సంస్థలు వీటిని సవరించే అవకాశం ఉన్నందున లెక్కలు మారవచ్చు. రికవరీలను బట్టి నష్టం తగ్గుతుంది. కొన్ని కేసుల్లో మొత్తం డబ్బు దారి మళ్లలేదని ఆర్బీఐ తెలిపింది.
బ్యాంకుల వెబ్సైట్లకు కొత్త డొమైన్లు
డిజిటల్ చెల్లింపులలో పెరుగుతున్న మోసాలను ఎదుర్కోవడానికి, రిజర్వ్ బ్యాంక్ భారతదేశంలోని బ్యాంకుల కోసం 'bank.in' బ్యాంకేతర సంస్థల కోసం 'fin.in' రూపంలో ప్రత్యేక ఇంటర్నెట్ డొమైన్ను ప్రవేశపెట్టాలని ప్రపోజ్ చేసింది. ఈ చొరవ డిజిటల్ బ్యాంకింగ్ చెల్లింపు సేవలపై నమ్మకాన్ని పెంచడంలో సహాయపడుతుంది. సురక్షితమైన ఆర్థిక సేవలను క్రమబద్ధీకరించడానికి ఉపయోగపడుతుంది.
ప్రత్యేక ఇంటర్నెట్ డొమైన్లు సైబర్ సెక్యూరిటీ బెదిరింపులు, ఫిషింగ్ వంటి హానికరమైన కార్యకలాపాలను గుర్తించడంలో కూడా దోహదపడుతాయి. సాధారణ ప్రజలకు ఆర్థిక నష్టాన్ని గణనీయంగా తగ్గిస్తాయని ఆర్బీఐ రిపోర్టు పేర్కొంది. ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ (ఐడీఆర్బీటీ) ఈ కార్యక్రమానికి ప్రత్యేక రిజిస్ట్రార్గా వ్యవహరిస్తుంది. బ్యాంకుల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2026 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమవుతుందని ఆర్బీఐ వెల్లడించింది.
రిపోర్ట్ హైలెట్స్:
ఆర్బీఐ రూ.2, రూ.5, రూ.2000 డినామినేషన్ల బ్యాంక్ నోట్లను ముద్రించడం నిలిపివేసింది. ముద్రణ నిలిపివేసినప్పటికీ, ఇవి ఇప్పటికీ చట్టబద్ధమైన కరెన్సీ (లీగల్ టెండర్) గానే కొనసాగుతాయి. ప్రస్తుతం రూ.2, రూ.5, రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500 రూ.2000 నోట్లు చలామణిలో ఉన్నాయి.
2023 మేలో రూ.2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించినప్పటి నుంచి 2025 మార్చి 31 నాటికి సుమారు 98.2 శాతం రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చాయి. మిగిలిన రూ.2000 నోట్లను 19 ఆర్బీఐ కార్యాలయాలు, ఇండియా పోస్ట్ ద్వారా బ్యాంకు ఖాతాలకు జమ చేసుకోవచ్చు.
2024–-25 ఆర్థిక సంవత్సరంలో కరెన్సీ ముద్రణ ఖర్చులు దాదాపు 25 శాతం పెరిగి రూ.6,372.8 కోట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇది రూ.5,101.4 కోట్లుగా ఉంది.
ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ మార్చి 31, 2025 నాటికి 8.20శాతం వృద్ధితో రూ. 76.25 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ వృద్ధికి ప్రధానంగా బంగారం నిల్వలు (52.09శాతం వృద్ధి), దేశీయ పెట్టుబడులు (14.32శాతం వృద్ధి), విదేశీ పెట్టుబడులు (1.70శాతం వృద్ధి) దోహదపడ్డాయి.
ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ.1,016 కోట్ల విలువైన డిజిటల్ రూపాయి చలామణిలో ఉందని ఆర్బీఐ ప్రకటించింది. 2024 మార్చినాటికి వీటి విలువ రూ.234 కోట్లుగా ఉంది. ఈ–-రూపాయి చలామణి విలువ 334 శాతం పెరిగింది.