మునుగోడులో బీసీలకు అవకాశం ఇవ్వాలె

మునుగోడులో బీసీలకు అవకాశం ఇవ్వాలె

హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ సీటు బీసీలకే కేటాయించాలని బీసీ రాజకీయ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమ తరపున అభ్యర్థిని నిలబెడుతామని హెచ్చరించారు. శనివారం బీసీ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో గన్ పార్కులోని అమర వీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం బీసీ రాజకీయ జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ... 1967లో మునుగోడు నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు ఏ పార్టీ కూడా బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వలేదని తెలిపారు. నియోజకవర్గంలో 70 శాతం ఉన్న బీసీలను వదిలేసి... 7 శాతం ఉన్న అగ్రకులస్థులకు టికెట్ కేటాయిస్తున్నారని మండిపడ్డారు.

బీసీలను ఓట్లేసే యంత్రాలుగా మార్చి... జెండాలు పట్టడానికి, జేజేలు కొట్టడానికి వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఏ ఒక్క పార్టీకి కూడా బీసీల మీద ప్రేమ లేదన్నారు. బీసీ అభ్యర్థికి ఏ పార్టీ టికెట్ ఇచ్చిన గెలిపించుకుంటామని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికలో బీసీలకు టికెట్ ఇవ్వకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.