ధర్మశాల: టీమిండియా క్రికెటర్లు ప్రపంచంలో ఎక్కడికెళ్లినా సెల్ఫీల గోల తప్పదు. మ్యాచ్ మధ్యలోనూ స్టాండ్స్లోని ఫ్యాన్స్కు కొందరు సెల్ఫీలు, ఆటోగ్రాఫ్లు ఇస్తుంటారు. అయితే సౌతాఫ్రికా సిరీస్లో మాత్రం ఈ సెల్ఫీల సీన్ కనిపించదు. కరోనా వైరస్ వ్యాప్తిస్తున్న నేపథ్యంలో బీసీసీఐ మెడికల్ టీమ్ వరల్డ్హెల్త్ ఆర్గనైజేషన్ సూచనల ప్రకారం టీమిండియాకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ‘ సబ్బు, నీటితో కనీసం 20 సెకండ్ల పాటు చేతిని కడుక్కోవాలి. హ్యాండ్ శానిటైజర్లు వాడండి. దగ్గినా, తుమ్మినా నోటిని కవర్ చేసుకోవాలి. జ్వరం లేదా ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వెంటనే మెడికల్ టీమ్కు సమాచారం ఇవ్వాలి. చేతులు శుభ్రం చేసుకోకుండా ముఖం, నోరు, ముక్కు, కళ్లను తాకకూడదు. బయటి రెస్టారెంట్లలో ఆహారం తీసుకోవద్దు. జట్టుతో సంబంధంలేని వ్యక్తులకు దూరంగా ఉండాలి. షేక్ హ్యాండ్స్ వద్దు. సెల్ఫీలివ్వడం కోసం వేరే వాళ్ల మొబైల్స్ను తాకొద్దు’ అని సూచించింది.

