
బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది.. క్షుద్ర పూజల కోసం పెంపుడు కుక్కను గొంతు కోసి చంపింది ఓ మహిళ. వింటుంటేనే ఒళ్ళు జలదరించేలా ఉన్న ఈ ఘటన స్థానికుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ కి చెందిన ఓ మహిళ కొన్నేళ్లుగా బెంగళూరులో నివాసం ఉంటోంది. కొద్దిరోజులుగా ఆమె ఉంటున్న ఇంటికి తాళం వేసి ఉండటంతో ఎక్కడికైనా వెళ్ళిందేమో అనుకున్నారు. కానీ.. ఆ ఇంట్లో నుంచి కుళ్లిపోయిన వాసన రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు.
స్థానికుల ఫిర్యాదుతో ఇంటి తలుపులు బద్దలు కొట్టి చుసిన అధికారులు షాక్ అయ్యారు. ఆ ఇంట్లో బట్టలో మూట కట్టిన కుక్క శవం కనిపించింది. అంతే కాకుండా ఇల్లంతా దేవుళ్ళ ఫోటోలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఇంట్లోని పరిస్థితిని క్షుద్ర పూజలు జరిగినట్లు నిర్దారించారు అధికారులు. కుక్క నాలుగు రోజుల క్రితమే చంపబడిందని పోస్టుమార్టంలో తేలినట్లు తెలిపారు అధికారులు.
ఘటన జరిగిన ఇంట్లో రెండు పెంపుడు కుక్కలు ఉండేవని అంటున్నారు స్థానికులు. ఘటనాస్థలిని పరిశీలించిన అధికారులు.. నిందితురాలిపై జంతు హింస చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పిలువబడే బెంగళూరులో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఆశ్చర్యం అని కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్.