
టాప్ లగ్జరీ కారును సొంతం చేసుకుని, హుషారుగా షికారు చేయాలన్న కోరిక చాలా మందికే ఉంటుంది. దాన్నే ఆసరాగా చేసుకుని మోసాలకు తెగబడ్డాడు ఓ జాదూ. తక్కువ రేటుకే మెర్సిడెస్ బెంజి కారు లాంటివి కావాలని వచ్చే వాళ్లను నమ్మించి డబ్బు దోచేయడం అలవాటుగా చేసుకున్నాడు. సెకండ్ హ్యాండ్లో మంచి కండిషన్లో ఉన్న లగ్జరీ కారు ఇప్పిస్తానని ముందు కొంత డబ్బు తీసుకుని జంప్ కావడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. ఓ కార్ రిపేర్ గ్యారేజీకి వచ్చిపోయేవారినే టార్గెట్ చేసుకుని, ఇప్పటి వరకు 30 మందిని మోసగించారు. తాజాగా కరోనా లాక్ డౌన్కు ముందు బెంగళూరులో ఓ వ్యక్తిని బురిడీ కొట్టించాడు.
బెంగళూరులో చిన్న వ్యాపారం చేసుకునే ఖలీల్ షరీఫ్ తక్కువ బడ్జెట్లో మంచి లగ్జరీ కారు కొనుక్కోవాలనుకున్నాడు. సెకండ్ హ్యాండ్ కారు కోసం జీవన్ బీమా నగర్లోని ఓ కారు గ్యారేజ్కి తరచూ వెళ్లేవాడు. ఏమైనా కార్లు సేల్కు వస్తే దాన్ని బేరం చేసి సొంతం చేసుకోవాలని అనుకున్నాడు. ఈ ప్రయత్నంలో ఉన్న ఖలీల్కు అక్కడ ఆ గ్యారేజ్ ఓనర్ బంధువు దస్తగిరి పరిచయమయ్యాడు. రూ.2.25 లక్షల డబ్బు చూసుకుంటే 2006 మోడల్ బెంజి కారు ఇప్పిస్తానని అతడు చెప్పాడు. అయితే ఖలీల్ బేరమాడడంతో రూ.2 లక్షలకే వచ్చేలా చూస్తానని మాటిచ్చాడు. ముందుగా కొంత సొమ్ము ఇవ్వాలని అడిగాడు. దీంతో డబ్బు రెడీ చేసుకుని మార్చి 11న ఖలీల్ 78 వేల రూపాయలు గూగుల్ పే ద్వారా దస్తగిరికి ట్రాన్స్ఫర్ చేశాడు. ఆ సొమ్ము అందగానే రెండ్రోజుల్లో కారు ఇంటికే తెచ్చిస్తానని, మిగిలిన డబ్బు కొద్ది రోజుల్లోనే ఇచ్చేయాలని చెప్పాడు దస్తగిరి. తాను కోరుకున్న కారు వచ్చేయబోతోందని ఆనందంలో మునిగిపోయాడు ఖలీల్. కానీ ఎన్ని రోజులు గడుస్తున్నా కారు రాలేదు. ఏంటా అని దస్తగిరికి ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తోంది. అప్పటికీ మోసాన్ని గ్రహించలేకపోయాడు ఖలీల్. కరోనా లాక్డౌన్ కావడం వల్ల ఎక్కడైనా చిక్కుకుపోయి.. కారు డెలివరీ ఇవ్వలేకపోయి ఉండొచ్చని అనుకున్నాడు. దాదాపు మూడు నెలలు వెయిట్ చేసిన ఖలీల్ ఇటీవలే లాక్డౌన్ ముగిసిన తర్వాత ఆ గ్యారేజ్ దగ్గరకు వెళ్లాడు. అక్కడ కనుక్కొంటే దస్తగిరి చేత ఆ డబ్బు ఇప్పిస్తానని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు గ్యారేజ్ ఓనర్. అయితే దీనిపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చేందుకు వెళ్లాడు ఖలీల్. అసలు విషయం అక్కడ తెలిసింది. దస్తగిరికి ఇలా మోసాలు చేయడం కొత్త కాదని, ఇప్పటికే ఈ తరహా మోసాలపై 30 ఫిర్యాదులు ఉన్నాయని పోలీస్ స్టేషన్లో తెలుసుకుని షాకయ్యాడు.