
బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)ని విక్రయిస్తున్నారని వచ్చిన వార్తలపై ఫ్రాంచైజీ యాజమాన్యం స్పష్టత ఇచ్చింది. తాము ఎలాంటి వాటాలు అమ్మడం లేదని, వస్తున్న కథనాలన్నీ అవాస్తవాలేనని వెల్లడించింది. ఇండియాలో పొగాకు, ఆల్కహాల్ బ్రాండ్ల ప్రమోషన్పై నిషేధం ఉన్నప్పటికీ తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకోవడానికి ఇతర మార్గాలున్నాయని తెలిపింది. ‘ఆల్కహాల్ బ్రాండ్ల ప్రమోషన్కు ఆర్సీబీ అమ్మకానికి ఎలాంటి సంబంధం లేదు. డియాజియో కంపెనీ ఉత్పత్తులను ఎలా ప్రమోట్ చేయాలో మాకు తెలుసు. కాకపోతే ఈ బ్రాండ్లకు సంబంధించి ఇండియన్ గవర్నమెంట్తో జరిపిన చర్చలు సంతృప్తినిచ్చాయి. దాని ప్రకారమే మేం ముందుకెళ్తాం. ఇప్పటికైతే ఆర్సీబీలో ఎలాంటి వాటాలు అమ్మడం లేదు’ అని ఫ్రాంచైజీ ఓ ప్రకటనలో పేర్కొంది.
మరోవైపు టైటిల్ గెలవడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆర్సీబీ విలువ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో కొన్ని వాటాలు అమ్మి సొమ్ము చేసుకోవాలని ఫ్రాంచైజీ భావించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇది కూడా అవాస్తవమేనని యజమానులు స్పష్టం చేశారు. ఐపీఎల్ ఆరంభంలో ఆర్సీబీని కొనుగోలు చేసిన విజయ్ మాల్యా.. తర్వాత జరిగిన పరిణామాలతో ఫ్రాంచైజీ నుంచి తప్పుకున్నాడు. దీంతో డియాజియో అనుబంధ సంస్థ అయిన యునైటెడ్ స్పిరిట్స్ ఆర్సీబీని నడిపిస్తోంది. ప్రతీ ఏడాది ఐపీఎల్ విలువ భారీగా పెరుగుతుండటంతో ప్రస్తుత యజమానులకు ఇది ప్రతిష్టాత్మకమైన ఆస్తుల్లో ఒకటిగా మారిపోయింది.