హైదరాబాద్ లో టెంపుల్ టూరిజం పెంచండి : భట్టి విక్రమార్క

హైదరాబాద్ లో టెంపుల్ టూరిజం పెంచండి : భట్టి విక్రమార్క
  • ఖాళీ జాగాల్లో కాటేజీలు నిర్మించండి
  • అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం
  • ఎండోమెంట్, ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌ , పర్యావరణ శాఖల బడ్జెట్​పై సమీక్ష

హైదరాబాద్ , వెలుగు : రాష్ట్రంలో ఎన్నో ఆలయాలు ఉన్నందున టెంపుల్ టూరిజానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు దేవాలయ ఖాళీ భూముల్లో ఆలయ సందర్శకుల సౌకర్యార్థం కాటేజీలు నిర్మించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు.

ఎండోమెంట్, ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌ , పర్యావరణ శాఖల బడ్జెట్​పై మంగళవారం సెక్రటేరియెట్ లో భట్టి విక్రమార్క రివ్యూ చేపట్టారు. ఈ మీటింగ్​లో ఎండోమెంట్, ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌ , పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖతో పాటు  ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.  ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు మరింత ఎక్కువ సంఖ్యలో సందర్శించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని భట్టి అన్నారు.

పెద్దగా ఆదాయం లేని దేవాలయాలకు ధూపదీప నైవేద్యం కింద ఆర్థిక సహాయాన్ని అందించే పథకాన్ని మరింత సరళతరం చేయాలని సూచించారు. ప్రధానంగా అటవీ శాఖతో కలిసి టెంపుల్ టూరిజాన్ని, ఎకో టూరిజంతో కలిసి టూరిస్ట్ సర్క్యూట్స్ ను ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో నాగోబా, మేడారం లాంటి గిరిజన జాతరలకు సంబంధించి దేశ, విదేశీ పర్యాటకులను ఆహ్వానించేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని ఆయన తెలిపారు. 

మెడిసినల్​ ప్లాంటేషన్​ చేపట్టాలి

రాష్ట్రంలో అటవీ సంపద, వన్య ప్రాణుల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు ఏజెన్సీ, అటవీ భూముల్లో గిరిజనులకు ఆర్థికపరమైన మేలు జరిగేలా ఆయుర్వేద సంబంధిత మెడిసినల్ ప్లాంటేషన్లను చేపట్టాలని అధికారులకు భట్టి విక్రమార్క సూచించారు. ఆయుష్ శాఖ, ఆయుర్వేద మందుల కంపెనీలతో ఈ మెడిసినల్ ప్లాంటేషన్లకు సంబంధించి మార్కెటింగ్​ను అనుసంధానం చేయాలని అన్నారు. అటవీ ప్రాంతాల్లో సఫారీ, ఎకో టూరిజానికి నగర వాసుల్లో మంచి ఆదరణ ఉందని, ఈ విధమైన పర్యాటకాభివృద్ధి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. అటవీ ప్రాంతాల్లో వివిధ అవసరాలకు సోలార్ పవర్ యూనిట్లను ఏర్పాటు చేయాలని భట్టి ఆదేశించారు. 

దేవుడి మాన్యాల పరిరక్షణ: కొండా సురేఖ

దేవుడి మాన్యాల పరిరక్షణతో పాటు, అన్యాక్రాంతమైన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి కొండా సురేఖ అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి తెలంగాణకు చెందిన భక్తులు ఎక్కువ సందర్శిస్తుంటారని తెలిపారు. గణనీయమైన ఆర్థిక వనరులు సమకూరుస్తున్నారన్నారు. తెలంగాణ భక్తులకు కూడా తిరుమలలో ప్రాధాన్యం ఇచ్చేలా చూడాలని డిప్యూటీ సీఎం భట్టిని ఆమె కోరారు. వన్యప్రాణుల దాడుల్లో ఎవరైనా మరణిస్తే పరిహారాన్ని రూ. 5 లక్షల నుంచి 10 లక్షకు తమ ప్రభుత్వం పెంచిందని తెలిపారు. రాష్ట్రంలో బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీలను తిరిగి పునరుద్దరించనున్నట్టు చెప్పారు.