‘‘నిజమే.. ప్లాస్టిక్ వాడితే ప్రాణాలు పోతాయని భయపెడితే తప్ప జనంలో మార్పు రాదు. నిజానికి ప్రాణాలు పోతున్న విషయం తెలిసి కూడా వాడుతున్నారు. అయితే ఈ ఎఫెక్ట్ వెంటనే ఉండడం లేదు. అందుకే ప్లాస్టిక్ వల్ల కలిగే హాని గురించి ప్రజలు అంత సీరియస్గా ఉండడంలేదు. తడి చెత్తను, పొడి చెత్తను వేరువేరుగా వేయమని జీహెచ్ఎంసీ డబ్బాలు ఇచ్చినా.. ఆ డబ్బాలను ఏదో అవసరానికి వాడుతున్నారే తప్ప, చెత్తను వేరుగా వేయడానికి మాత్రం ఉపయోగించడంలేదు. కానీ చాలామందికి తెలియదు.. చెత్తలో నుంచి బయటకు వచ్చే నీళ్లలాంటి లిక్విడ్ చాలా డేంజరస్.
తడి చెత్తను, పొడి చెత్తను వేరువేరుగా వేస్తే.. రీసైక్లింగ్ ప్రక్రియ ఈజీ అవుతుంది. తడిచెత్త మరెన్నింటికో ఉపయోగపడుతుంది. కానీ ప్రజల నుంచి సహకారం లేకపోవడం వల్లే ప్లాస్టిక్ రీసైక్లింగ్ పూర్తిస్థాయిలో సాధ్యం కావడంలేదు. ప్రజల్లో మార్పు వచ్చేవరకు ప్లాస్టిక్ నుంచి ముప్పును తప్పించడం అసాధ్యం’’ అంటున్నారు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ సయెదా అజీమ్ ఉన్నిసా. గత 18 సంవత్సరాలుగా ‘సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్’పై పరిశోధనలు చేస్తున్న ఆమె ఇటీవలే ‘బయోడీగ్రేడబుల్ మెటీరియల్’ను తయారుచేశారు. ఆహార వ్యర్థాల నుంచి తయారుచేసిన ఈ మెటీరియల్ ప్లాస్టిక్లాంటిదే, కానీ ప్లాస్టిక్ కాదంటారామె. నెలరోజుల్లోనే పూర్తిగా భూమిలో కలిసిపోయే ఈ కొత్తరకం ‘ప్లాస్టిక్’ గురించి ప్రొఫెసర్ ఉన్నిసా చెప్పిన వివరాలు ఆమె మాటల్లోనే..
ప్లాస్టిక్ లేకుండా రోజు గడవడం కష్టమే..
ప్లాస్టిక్ వాడకుండా ఉండలేని రోజును ఊహించుకోవడం కష్టమే. ఎందుకంటే.. మార్నింగ్ లేవగానే పళ్లు తోముకోవడానికి వాడే బ్రష్ నుంచే మన ప్లాస్టిక్ వాడకం మొదలవుతుంది. ఆ తర్వాత బాత్రూమ్లో సబ్బుపెట్టె, తల దువ్వుకునే దువ్వెన, జేబుకున్న పెన్ను, చేతిలో ఉన్న ఫోను, కళ్లకు పెట్టుకున్న స్పెక్ట్స్, చెవుల్లో పెట్టుకున్న ఇయర్ బడ్స్, చేతికున్న వాచ్, చూస్తున్న టీవీ, దాన్ని ఆపరేట్ చేసే రిమోట్, కూర్చున్న చైర్, వేసుకున్న చెప్పులు, తొడుక్కున్న షర్ట్, దానికున్న బటన్స్, నడిపే బైక్, దాన్ని ఆన్ చేసే ‘కీ’, ఆఫీస్లో కంప్యూటర్ మానిటర్, కీబోర్డ్, మౌస్, తాగే వాటర్ బాటిల్, లంచ్బాక్స్, వెలుగునిచ్చే బల్బు, దానికి కరెంట్ సప్లయ్ చేసే వైర్, ఆన్ చేసే స్విచ్, చల్లగాలికోసం వాడే ఫ్యాన్, ఏసీ.. ఇలా చెప్పుకుంటూపోతే మనం వాడుతున్న ప్లాస్టిక్ వస్తువుల లిస్ట్ ఎండ్ కావడం కష్టమే. అంతెందుకు మనం తింటున్న ఆహారంలో కూడా ప్లాస్టిక్ ఉంటోంది. ఒక్కమాటలో చెప్పాలంటే మనం ప్లాస్టిక్ను టచ్ చేయకుండా ఒక్కరోజు కూడా గడపడం లేదు. అంతలా ప్లాస్టిక్ మన జీవితాల్లో భాగమైపోయింది.
రోజుకు 45వేల టన్నుల చెత్త
కేవలం ప్లాస్టిక్ వాడకం వల్లే చెత్తను సరిగ్గా వినియోగించలేకపోతున్నాం. ఇప్పటికే హైదరాబాద్లో ఆటోనగర్, గందంగూడ, జవహర్నగర్ డంప్ యార్డ్లు పూర్తిగా నిండిపోయాయి. రోజుకు 45,000 మెట్రిక్ టన్నుల చెత్త అదనంగా దీనికి తోడవుతోంది. ఇది ఇలాగే కొనసాగితే రేపటి నుంచి చెత్తను ఎక్కడ డంప్ చేస్తారు? డంప్యార్డుల నుంచి వచ్చే దుర్వాసన, హానికరమైన విషవాయువులు చుట్టు పక్కల ఉంటున్న ప్రజల ఆరోగ్యాన్ని పాడుచేస్తున్నాయి. ఒకవేళ ఈ చెత్తలో ప్లాస్టిక్ కవర్లు వంటివి లేకపోతే దానిని ఎన్నోరకాలుగా ఉపయోగించుకునే అవకాశముంది. గత రెండు దశాబ్దాలుగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద పరిశోధనలు చేస్తున్నా. ఆ డంప్యార్డులను చూసినప్పుడల్లా అనిపించేది.. ఈ చెత్త నుంచే ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయాన్ని తయారుచేస్తే ఎలా ఉంటుంది? అని. ఎన్నో ప్రయోగాల తర్వాత ఆ చెత్త నుంచి స్టార్చ్ను సేకరించగలిగాం. ఆ స్టార్చ్నే ‘బయోడీగ్రేడబుల్ మెటీరియల్’గా మార్చాం.
కెమికల్స్ జోలికి వెళ్లలేదు..
స్టార్చ్ను బైండింగ్ మెటీరియల్గా మార్చాం. దీనికోసం కెమికల్స్ను కలపలేదు. చెత్త నుంచి బయోడీగ్రేడబుల్ మెటీరియల్ ఇప్పటికే తయారుచేసినా.. స్టార్చ్ను బైండింగ్ మెటీరియల్గా మార్చేందుకు కొన్నిరకాల కెమికల్స్ను కలిపారు. మేం మాత్రం హానికరమైన రసాయనాల జోలికే వెళ్లకుండా తయారుచేశాం. ఈ మెటీరియల్ను సీపెట్(సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ)కు పంపించాం. అక్కడ ప్లాస్టిక్స్కు సంబంధించిన అనాలసిస్ జరుగుతుంది. అయితే మేం తయారుచేసిన ఈ బయోడీగ్రేడబుల్ మెటీరియల్కు ప్లాస్టిక్కు ఉండే ఎలాస్టిసిటీ ఉన్నట్టుగా రిపోర్ట్ వచ్చింది. అంత ఈజీగా బ్రేక్ కాదని కూడా సీపెట్ సైంటిస్టులు చెప్పారు. ఈ మెటీరియల్తో గిన్నెలు, గ్లాస్లు, ప్లేట్లు, కవర్లు, పిల్లలు ఆడుకునే బొమ్మలు కూడా తయారుచేయొచ్చని సీపెట్ సైంటిస్టులు చెప్పారు.
మట్టిలో కలవడానికి నెలరోజులు చాలు..
పూర్తిగా ఆహార వ్యర్థాలతోనే తయారుచేసిన ఈ మెటీరియల్ డీగ్రేడ్ కావడానికి కూడా పెద్దగా సమయం పట్టదు. కేవలం 25 రోజుల్లోనే మట్టిలో కలిసిపోతుంది. దీనిని స్వయంగా మేమే సెమ్(స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్) ద్వారా పరిశీలించాం. ఒక వైపు ప్లాస్టిక్ను, మరోవైపు మేం తయారుచేసిన మెటీరియల్ను పెట్టి నెలరోజులపాటు పరిశీలించాం. అయితే ప్లాస్టిక్ ఏమాత్రం కరిగిపోలేదు. మేం తయారుచేసిన మెటీరియల్ మాత్రం నెలరోజుల్లో పూర్తిగా మట్టిలో కలిసిపోయింది.
ఎరువుగా కూడా..
ఆరోగ్యానికి హానిచేసే రసాయనాలు, ముడిపదార్థాలేవీ వాడకుండా ఈ మెటీరియల్ను తయారుచేయొచ్చు. వాడిన తర్వాత మొక్కలకు, పంటపొలాలకు ఎరువుగా కూడా వాడుకోవచ్చు. ఈ ఎరువుతో పండిన పంటలు కూడా ఆరోగ్యకరమైనవే. ఎందుకంటే ఈ ఎరువు వాడిన తర్వాత ఎటువంటి ఫెర్టిలైజర్స్ వాడాల్సిన అవసరం కూడా ఉండదు. అంటే.. ఓ రకంగా ఆర్గానిక్ పంటలు పండించిన వాళ్లమవుతాం.
ఐఐటీ గువాహటి సైంటిస్టులు కూడా..
ఐఐటీ గువాహటి సైంటిస్టులు కూడా ఇలాంటి బయో ప్లాస్టిక్నే తయారుచేశారు. అయితే ఈ ప్లాస్టిక్ తయారీకి అవసరమైన ముడిపదార్థాన్ని మాత్రం చెరకు, చొప్ప వంటి పంట వ్యర్థాల నుంచి సేకరించారు. పంట వ్యర్థాల నుంచి తీసిన ముడిపదార్థాన్ని పాలీమరైజేషన్ అనే ప్రక్రియ ద్వారా ప్లాస్టిక్గా మార్చారు. ఇది సాధారణ ప్లాస్టిక్కు ఏమాత్రం తీసిపోదని అంటున్నారు ఐఐటీ గువాహటి ప్రొఫెసర్ విమల్ కతియార్. ఇప్పుడు ఉపయోగిస్తున్న ప్లాస్టిక్ కంటే కూడా తక్కువ ఖర్చుకే ప్లాస్టిక్ను తయారుచేసే అవకాశముందని, ఇది ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయం అవుతుందంటున్నారు ఈ ప్రాజెక్టుకు డైరెక్టర్గా వ్యవహరించిన డాక్టర్ టీజీ సీతారాం. దీనిని రూమ్ టెంపరేచర్లో ఉంచినా ఆరు నుంచి ఎనిమిది నెలల్లో భూమిలో కలిసిపోతుంది అని చెప్పారు. ఇదే ఈ బయోప్లాస్టిక్కు ఉన్న ప్రత్యేకతగా అయన చెప్పారు.
ఇదిలాఉంటే…‘ సాధారణ ప్లాస్టిక్ను, బయోప్లాస్టిక్ రీసైకిల్ అయ్యే డబ్బాలో వేస్తే బయోప్లాస్టిక్ భూమిలో కలిసిపోయే ప్రక్రియ సరిగ్గా జరగదు. అలాగే బయోప్లాస్టిక్ రీసైకిల్ అయ్యే డబ్బాలో సాధారణ ప్లాస్టిక్ వేసినా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. అందుకే భూమిలో కలిసిపోయే ప్లాస్టిక్ను అందుబాటులోకి తెచ్చేముందే.. సాధారణ ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించాలి. అప్పుడే బయోప్లాస్టిక్ వల్ల ఫలితాలుంటాయి. లేదంటే ఎటువంటి ప్రయోజనం ఉండద’ని చెబుతున్నారు ప్రముఖ పర్యావరణవేత్త నసా అలీ.