ఆత్మహుతి చేసుకున్న డ్రైవర్ శ్రీనివాస్రెడ్డి భౌతికకాయానికి పోస్టుమార్టం పూర్తయ్యాక ఆదివారం రాత్రి హైదరాబాద్ నుంచి ఖమ్మం తరలించడంతో అంతిమయాత్రలో పాల్గొనడానికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, జితేందర్రెడ్డి, పెద్దిరెడ్డి తరలివెళ్లారు. శ్రీనివాస్రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు.
హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో ఉధృతంగా సాగుతున్న ఆర్టీసీ సమ్మెలో బీజేపీ క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. సమ్మెకు మద్దతిస్తూ కార్మికులకు అండగా నిలుస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నీ తానై ముందుండి నడిపిస్తున్నారు. ఆర్టీసీ జేఏసీ నేతలు ఈ నెల 11న కలిసి తన మద్దతు కోరిన కాసేపటికే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పార్టీ నాయకులతో సమావేశమై ఉద్యమ వ్యూహాన్ని రూపొందించారు. తర్వాతి రోజు పొద్దున్నే బస్భవన్ను ముట్టడించారు. దీంతో అప్పటివరకు ఆర్టీసీ కార్మికుల వరకే పరిమితమైన సమ్మె.. బీజేపీ రంగ ప్రవేశంతో తీవ్ర ఉద్యమ రూపం దాల్చింది.
లక్ష్మణ్.. పోరాటం
ఇంటర్ ఫలితాల గందరగోళం, స్టూడెంట్ల ఆత్మహత్యలు, గ్లోబరీనా ఇష్యూలో ఆందోళనలు చేసి ఆమరణ నిరాహార దీక్షకు దిగిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్.. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలోనూ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఎక్కడ సమస్య తలెత్తితే అక్కడ వాలిపోతున్నారు. బస్భవన్ ముట్టడిలో లక్ష్మణ్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు భారీగా పాల్గొన్నాయి. దీంతో వారిని నియంత్రించడానికి వందలాది మంది పోలీసులను ప్రభుత్వం మోహరించింది. ఈ క్రమంలో లక్ష్మణ్ సొమ్మసిల్లి పడిపోవడం, ఆయనకు గాయాలవడంతో కలకలం రేగింది.
ఎక్కడికక్కడ ధర్నాలు
ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బీజేపీ నేతలు ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. కార్మికులకు సంఘీభావంగా బీజేపీ నేతలు జి.వివేక్ వెంకటస్వామి, కృష్ణసాగర్రావు, రఘునందన్రావు, మోహన్రెడ్డి, రవీంద్రనాయక్, పెద్దిరెడ్డి తదితరులు ఆందోళనల్లో భాగస్వాములవుతున్నారు.
సర్కారు ఉక్కిరిబిక్కిరి
బీజేపీ నాయకత్వం చేస్తున్న ఆందోళనలు, కార్మికులకు అండగా నిలుస్తుండటంతో రాష్ట్ర సర్కారు ఉక్కిరిబిక్కిరవుతోంది. టీఆర్ఎస్, మజ్లిస్ మినహా ఇతర పార్టీలన్నీ కార్మికులకు సంఘీభావంగా ఉద్యమం చేస్తున్నా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, తలసాని శ్రీనివాస్యాదవ్, ఇతర టీఆర్ఎస్ నేతలు బీజేపీనే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు.