కన్స్ట్రక్షన్ కంపెనీ ముందు బీజేపీ నేతల ఆందోళన
మూసాపేట, వెలుగు : ఇష్టమొచ్చినట్లుగా తవ్వకాలు చేపట్టి ప్రజా ఆస్తులను ఎలా ధ్వంసం చేస్తారంటూ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదర్నగర్ డివిజన్ పరిధి గౌతమినగర్లో ప్రణీత్ ప్రణవ్ ఇక్సోరా కన్స్ట్రక్షన్ కంపెనీ భారీ బిల్డింగ్లను నిర్మిస్తోంది. అందులో భాగంగా సెల్లార్లు తవ్వుతూ రోడ్డుకు దగ్గరగా రావడంతో బుధవారం కాలనీ రోడ్డు కుంగి దాని కింది డ్రైనేజీ, మంచి నీటి వ్యవస్థ ధ్వంసమైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ ఆఫీస్ ముందు గురువారం కాలనీ వాసులు, బీజేపీ నాయకులు ఆందోళన చేశారు.
గౌతమినగర్ కాలనీ వాసులకు వెంటనే రోడ్డు, డ్రైనేజీ, మంచినీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రత్నామ్నాయ ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ యాజమాన్యం హామీ ఇవ్వటంతో ఆందోళన విరమిస్తున్నట్లు బీజేపీ నేతలు వెల్లడించారు. ఈ ఆందోళనలో నాయకులు సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ జానకి రామరాజు తదితరులు పాల్గొన్నారు.