ఆఖరి మ్యాచ్ లో గెలిచిన సింధు

ఆఖరి మ్యాచ్ లో గెలిచిన సింధు

గ్వాంగ్జూ: డిఫెండింగ్‌‌ చాంపియన్‌‌ పీవీ సింధు.. వరల్డ్‌‌ టూర్‌‌ ఫైనల్స్‌‌ను విజయంతో ముగించింది. తొలి రెండు మ్యాచ్‌‌ల్లో ఓడి టోర్నీ నాకౌట్‌‌ ఆశలను గల్లంతు చేసుకున్న తెలుగమ్మాయి.. శుక్రవారం జరిగిన నామమాత్రపు మ్యాచ్‌‌లో గెలిచింది.  గ్రూప్‌‌–ఎ ఆఖరి మ్యాచ్‌‌లో ప్రపంచ ఆరో ర్యాంకర్‌‌ సింధు 21–19, 21–19తో  హి బింగ్‌‌జియావో (చైనా)ను చిత్తు చేసింది. గతేడాది అద్భుతమైన ఆటతో టైటిల్‌‌ సాధించిన ఇండియన్‌‌ ప్లేయర్‌‌ ఈసారి ఆ ఫీట్‌‌ను రిపీట్‌‌ చేయలేకపోయింది. 42 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌‌లో సింధు సూపర్‌‌ పెర్ఫామెన్స్‌‌ చూపెట్టింది. ఫస్ట్‌‌ గేమ్‌‌లో 3–7తో వెనుకంజలో ఉన్న సింధు షటిల్‌‌ను సరిగా అంచనా వేయకపోవడంతో.. చైనీస్‌‌ ప్లేయర్‌‌ 11–6 లీడ్‌‌తో బ్రేక్‌‌కు వెళ్లింది. బ్రేక్‌‌ తర్వాత కూడా సింధు తప్పులు చేయడంతో బింగ్‌‌ జియావో 18–9తో భారీ ఆధిక్యంలో నిలిచింది. కానీ ఈ దశలో తెలుగమ్మాయి తెగించి పోరాడింది. వరుసగా 9 పాయింట్లు సాధించి 18–18తో స్కోరు సమం చేసింది. బింగ్‌‌ జియావో మంచి రిటర్న్‌‌తో పాయింట్‌‌ సాధించినా.. బలమైన స్మాష్‌‌లతో సింధు రెండు పాయింట్లు గెలిచి గేమ్‌‌ను సొంతం చేసుకుంది. ఇక రెండో గేమ్‌‌ ఆరంభంలో మెరుగ్గా ఆడిన సింధు 7–3, 11–6తో బ్రేక్‌‌కు వెళ్లింది. విరామం తర్వాత తెలుగమ్మాయి అనవసర తప్పిదాలు చేయడంతో ఆధిక్యం 15–10కి తగ్గింది. ఈ దశలో మరింత పుంజుకున్న చైనీస్‌‌ అమ్మాయి గ్యాప్‌‌ను 16–18కి తగ్గించింది. బ్యాక్‌‌లైన్‌‌లో మంచి జడ్జ్‌‌మెంట్‌‌ చూపెట్టిన సింధు వరుసగా మూడు పాయింట్లు గెలిచి గేమ్‌‌తో పాటు మ్యాచ్‌‌ను సొంతం చేసుకుంది.