లా కాలేజీలో విద్యార్థినిపై దారుణం.. ఏం జరిగిందంటే..!

లా కాలేజీలో విద్యార్థినిపై దారుణం.. ఏం జరిగిందంటే..!
  • కోల్​కతాలో మరో ఘోరం

కోల్‌‌కతా: బెంగాల్ రాజధాని కోల్‌‌కతాలోని లా కాలేజీలో విద్యార్థిని(24)పై గ్యాంగ్‌‌రేప్ జరిగింది. హాకీ స్టిక్‌‌తో దాడిచేసి, కుటుంబాన్ని జైలుకు పంపుతామని బెదిరించి నిందితులు ఈ ఘోరానికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని వీడియో తీసి ఎవరికైనా చెప్తే అందరికీ షేర్ చేస్తామని బ్లాక్‌‌మెయిల్ చేశారు. నిందితుల్లో ఒకరు కాలేజీ పూర్వ విద్యార్థి కాగా, మరో ఇద్దరు అదే కాలేజీలో లా చదువుతున్నారు

ప్రధాన నిందితుడైన పూర్వ విద్యార్థి రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఎంసీ పార్టీ యువజన విభాగంలో కీలక నేత. సీఎం మమతా బెనర్జీ కుటుంబ సభ్యులు, ఒక మంత్రితో అతను ఉన్న ఫొటోలు, వీడియోలు ప్రతిపక్షాలు సోషల్‌‌మీడియాలో పోస్ట్ చేశాయి. 

రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కాపాడడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శలు చేస్తున్నాయి. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. కోల్‌‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ విద్యార్థిని రేప్, మర్డర్ ఘటన మరువకముందే ఈ దారుణం చోటుచేసుకుంది. 

సెక్యూరిటీ గదిలోకి లాక్కెళ్లి..

2025 జులై 25న రాత్రి సౌత్‌‌ కోల్‌‌కతా లా కాలేజీలో ఈ దారుణం జరిగింది. బాధితురాలు తన ఎగ్జామ్స్ కు సంబంధించిన కొన్ని ఫారమ్‌‌లు నింపేందుకు మధ్యాహ్నం కాలేజీకి వెళ్లింది. ఆ పని పూర్తి చేసుకొని సాయంత్రం తిరిగి వెళ్లే సమయంలో పూర్వ విద్యార్థి మనోజిత్ మిశ్రా(31), జైబ్ అహ్మద్(19), ప్రమిత్ ముఖర్జీ(20) ఆమెను కాలేజీలోని సెక్యూరిటీ గార్డ్ గదిలోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు తల్లిదండ్రుల సాయంతో కస్బా పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ నెల 27న ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. అలీపూర్ కోర్టులో హాజరుపరిచి, కస్టడీకి తీసుకున్నారు.

ఫిర్యాదులో ఏముందంటే?

బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. ‘‘తనకు విధేయంగా ఉండాలని, సెక్స్ వల్ రిలేషన్​పెట్టుకోవాలని మనోజిత్ నాపై ఒత్తిడి తెచ్చాడు. నేను నిరాకరించాను. మరో వ్యక్తిని ప్రేమిస్తున్నానని చెప్పాను. నన్ను గట్టిగా పట్టుకోవడంతో వెనక్కి నెట్టేసి ప్రతిఘటించేందుకు ప్రయత్నించాను. దీంతో అతను హాకీ స్టిక్​తో దాడిచేశాడు. అతడి కాళ్లపై పడి వేడుకున్నా విడిచిపెట్టలేదు. 

తనకున్న రాజకీయ పలుకుబడితో నా తల్లిదండ్రులపై తప్పుడు కేసులు పెట్టి జైలుపాలు చేయిస్తానని బెదిరించారు. బలవంతంగా గార్డ్ రూమ్‌‌కు తీసుకెళ్లి, నా బట్టలు విప్పి వీడియోలు తీశారు. వాటిని వైరల్ చేస్తామని బెదిరించి నా నోరు మూయించారు. తర్వాత బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డారు. దాన్నంతా వీడియో తీసి ఎవరికైనా చెప్తే ఆన్​లైన్​లో పెడ్తామని బ్లాక్​మెయిల్ చేశారు” అని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.