తెలంగాణలో క్యాంపు పాలిటిక్స్ ..కౌంటింగ్కు ముందే క్యాంపులకు అభ్యర్థులు

 తెలంగాణలో క్యాంపు పాలిటిక్స్ ..కౌంటింగ్కు ముందే క్యాంపులకు అభ్యర్థులు
  • కౌంటింగ్​కు ముందే క్యాంపులకు అభ్యర్థులు 
  • అన్ని ప్రధాన పార్టీలదీ ఇదే తీరు 
  • ఈ నెల 16న మేయర్, చైర్​పర్సన్​ ఎన్నికలు
  • అప్పటి వరకు అభ్యర్థులను కాపాడుకునే పనిలో పార్టీలు

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో క్యాంప్​ పాలిటిక్స్​ మొదలయ్యాయి. గతంలో ఎన్నికల ఫలితాల తర్వాత  క్యాంపులు మొదలయ్యేవి. కానీ ఈసారి కౌంటింగ్​కు ముందే ఆయా పార్టీలు తమ అభ్యర్థులను క్యాంపులకు తరలిస్తున్నాయి.  బుధవారం పోలింగ్​ ముగిసిన వెంటనే రాత్రికి రాత్రే పలుచోట్ల నేతలు తమ అభ్యర్థులను ఇతర ప్రాంతాలకు తరలించారు. వీరిని శుక్రవారం జరగనున్న కౌంటింగ్​కు తీసుకొచ్చి, గెలుపు ఖాయమైతే అటు నుంచి అటే తిరిగి క్యాంపులకు తరలించేందుకు ఏర్పాట్లుచేశారు. ఈ నెల 16న మేయర్​, చైర్​పర్సన్​ ఎన్నికలు జరుగుతాయి. దీంతో అప్పటి వరకు అభ్యర్థులను కాపాడుకునేందుకు పార్టీలు ఈ క్యాంపు పాలిటిక్స్​కు తెరతీశాయి. 

పోలింగ్​ ముగియగానే క్యాంపు పాలిటిక్స్​ 

మున్సిపల్​ ఎన్నికలను కాంగ్రెస్, బీఆర్​ఎస్,  బీజేపీ చాలెంజ్​గా తీసుకున్నాయి. ఎక్కువ సంఖ్యలో మేయర్,​ చైర్​ పర్సన్​స్థానాలను  దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నాయి.  కార్పొరేషన్​, మున్సిపాలిటీల్లో సగానికి పైగా కార్పొరేటర్​, కౌన్సిలర్  సీట్లు వచ్చిన పార్టీకి  మేయర్​, చైర్ పర్సన్​గా ఎన్నికవుతారు.  ఒకటో, రెండో ఓట్లు తగ్గితే ఎక్స్​ అఫీషియో సభ్యులైన ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల ఓట్లు కీలకంగా మారతాయి.  మాజిక్​ ఫిగర్​ రాని చోట పీఠాలను కైవసం చేసుకునేందుకు ఆయా పార్టీలు ఇండిపెండెంట్లు, ఇతరులను కూడా ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తాయి. గెలుపు అవకాశాలున్న ఇండిపెండెంట్లపై ఇప్పటికే పార్టీలు ఫోకస్​పెట్టినట్టు తెలుస్తోంది. హంగ్​ పరిస్థితి వస్తే మెజారిటీ సీట్లు దక్కించుకున్న పార్టీ..   డిప్యూటీ మేయర్​, డిప్యూటీ చైర్​ పర్సన్​పదవుల ఆశ చూపి ఇతర పార్టీలకు గాలం వేసే అవకాశం ఉంది.   ఇప్పటికే కొన్ని చోట్ల  బీఆర్​ఎస్​, బీజేపీ  మధ్య ఇలాంటి సర్దుబాట్లు జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. ఒకటిరెండు చోట్ల  కాంగ్రెస్,  ఎంఐఎంల మధ్య రాజీ కుదిరే చాన్స్​ ఉంది. అధికార పార్టీ గెలిచిన తమ క్యాండిడేట్లను తన్నుకుపోకుండా  బీఆర్​ఎస్, బీజేపీ జాగ్రత్త పడుతున్నాయి. ఇందులో భాగంగా తమ అభ్యర్థులను  క్యాంపులకు తరలించాయి.

క్యాంపుకు వెళ్లింది వీరే..

మంచిర్యాల కార్పొరేషన్​లో బీజేపీ అభ్యర్థులను ఆ పార్టీ స్టేట్​ వైస్ ప్రెసిడెంట్ వెరబెల్లి రఘునాథ్​రావు  బుధవారం రాత్రే మహారాష్ట్రలోని చంద్రాపూర్​కు తరలించారు.  చెన్నూర్, క్యాతనపల్లి మున్సిపాలిటీల బీఆర్ఎస్  అభ్యర్థులు కొండగట్టు క్యాంపులో ఉన్నారు. క్యాతనపల్లి కాంగ్రెస్ అభ్యర్థులు గురువారం సాయం త్రం హైదరాబాద్ తరలివెళ్లారు. రాజన్న  సిరిసిల్ల జిల్లా వేములవాడలో కాంగ్రెస్​కు చెందిన 28మంది అభ్యర్థులు బుధవారం రాత్రి క్యాంప్​కు బయలుదేరి వెళ్లారు. మొదటి నుంచీ వేములవాడ బల్దియా పై కాంగ్రెస్​ జెండా ఎగురవేయాలని ఎమ్యెల్యే అది శ్రీనివాస్​ వ్యూహ రచన చేస్తున్నారు. రామగుండం కార్పొరేషన్​లో వివిధ డివిజన్ల నుంచి పోటీచేసిన బీఆర్​ఎస్​అభ్యర్థులు గురువారం రాత్రి గోదావరిఖని మార్కండేయకాలనీలోని ఓ ఫంక్షన్​ హాల్​ నుంచి క్యాంపునకు తరలివెళ్లారు. మాజీ ఎమ్మెల్యే, బీఆర్​ఎస్​ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్​ ఆధ్వర్యంలో కొందరిని హైదరాబాద్​కు తరలించగా,  శుక్రవారం వచ్చే ఫలితాల ఆధారంగా మరికొందరిని క్యాంపునకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. 

16 దాకా క్యాంపుల్లోనే..!

రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో జరిగిన ఎన్నికలకు సంబంధించి శుక్రవారం  కౌంటింగ్​జరగనుంది. కౌంటింగ్​ పూర్తి కాగానే  అన్ని పార్టీలు గెలిచిన తమ అభ్యర్థులను క్యాంపునకు తరలించే ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇప్పటికే వెళ్లినవారు కూడా శుక్ర వారం కౌంటింగ్​సెంటర్​కు వచ్చి, తిరిగి వెళ్లే అవకాశముంది. దీంతో అభ్యర్థులం తా క్యాంపులకు వెళ్లేందుకు వీలుగా  బట్టలు సర్దు కుని కౌంటింగ్​ సెంటర్​కు రావాలని సూచించా రు. గెలిచినవారు చేజారకుండా  ఒక్కొక్కరికి ఇద్దరు, ముగ్గురు ప్రైవేట్​ వ్యక్తులకు బాధ్యతలు అప్పగించారు. క్యాపుల నిర్వహణ బాధ్యతలను తమ పార్టీల్లోని సీనియర్లు,  చురుకైన లీడర్లకు అప్పగించారు.  కాంగ్రెస్​లో అయితే స్వయంగా రాష్ట్ర మంత్రులే క్యాంపులకు ఏర్పాట్లు చేయిస్తు న్నారు. మేయర్​, చైర్​ పర్సన్​ ఎన్నికలకు మూడు రోజుల టైమ్​ మాత్రం ఉండడంతో దాదాపు అందరూ  హైదరాబాద్​శివార్లలో ఉన్న  రిసార్ట్​లు, ఫామ్​హౌజ్​లకు  తరలిస్తున్నారు.   మేయర్, చైర్​పర్సన్​ ఎన్నిక జరిగే 16న   ఉదయం 10 గంటలకు డైరెక్టుగా మున్సిపాలిటీ దగ్గరకే వారిని తీసుకుచ్చేలా ప్లాన్​ చేశారు.