IPL 2025 Final: ఐపీఎల్ ఫైనల్ ఆ జట్టే గెలుస్తుంది.. నా బెట్ రూ. 6.41 కోట్లు: కెనడియన్ స్టార్ సింగర్

IPL 2025 Final: ఐపీఎల్ ఫైనల్ ఆ జట్టే గెలుస్తుంది.. నా బెట్ రూ. 6.41 కోట్లు: కెనడియన్ స్టార్ సింగర్

ఐపీఎల్ 2025 ఫైనల్ సమరం మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. మంగళవారం (జూన్ 3) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు టైటిల్ కోసం పోరాడనున్నాయి. రెండు జట్లు సమ ఉజ్జీలుగా ఉండడంతో పాటు తొలిసారి ఒక కొత్త జట్టు ఐపీఎల్ లో విజేతగా నిలబోతుంది. దీంతో ఈ బ్లాక్ ఫైనల్ పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.  ప్రపంచ వ్యాప్తంగా బెట్టింగ్ భారీగా జరుగుతున్నట్టు సమాచారం. ఈ తుది పోరులో ప్రముఖ కెనడా సింగర్ రాపర్ డ్రేక్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్‌ను గెలుచుకుంటుందని.. ఫైనల్లో ఆర్సీబీ గెలుస్తుందనే నమ్మకంతో $750,000 బెట్ వేశాడు. 

భారత కరెన్సీలో ఇది అక్షరాలా రూ. 6.41 కోట్లు. క్రిప్టో-బెట్టింగ్ ప్లాట్‌ఫామ్ స్టేక్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో తన బెట్ వేసిన స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ.. డ్రేక్ ఆర్సీబీకి సపోర్ట్ చేస్తున్నట్టు  వెల్లడించాడు. 1.75 ఆడ్స్‌ ఉన్నప్పుడు అతను ఈ బెట్ వేశాడు. దీని ప్రకారం బెంగళూరు జట్టు ఐపీఎల్ ట్రోఫీ గెలిస్తే 100 కి 75 రూపాయలు వస్తాయన్నమాట. ఆర్సీబీ ఫైనల్ గెలిస్తే రాపర్ డ్రేక్ 1.3 మిలియన్ డాలర్లు (సుమారు 11.11 కోట్లు) గెలుచుకుంటాడు. ఈ పోస్ట్‌తో పాటు "ఈ సాలా కప్ నమ్దే" అనే ప్రసిద్ధ ఆర్సీబీ నినాదం కూడా ఉంది. 

ఈ సీజన్ లో అత్యద్భుతంగా ఆడిన పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్లు టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నారు. ఎవరు గెలిచినా వారికి ఇదే తొలి ఐపీఎల్ టైటిల్. దీంతో ఈ సారి రెండు జట్లు ఎలాగైనా ఐపీఎల్ టైటిల్ కొట్టాలని గట్టి పట్టుదలతో ఉన్నాయి. క్వాలిఫయర్ 1 లో పంజాబ్ ను చిత్తు చేసి ఆర్సీబీ ఫైనల్ చేరుకుంది. ఆదివారం (జూన్ 1) జరిగిన క్వాలిఫయర్ 2 మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై ఘన విజయం సాధించి పంజాబ్ కింగ్స్ ఫైనల్లో అడుగుపెట్టింది.