
చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై దుర్భాషలాడిన ఘటనలో ఎంపీ రంజిత్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంపీ రంజిత్ రెడ్డి తనకు ఫోన్ చేసి దుర్భాషలాడారని.. బెదిరింపు ధోరణితో మాట్లాడారని ఆరోపిస్తూ ఈనెల 20న బంజారా హిల్స్ పోలీసులకు కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు కోర్టు అనుమతితో ఐపీసీ సెక్షన్ 504 కింద కేసు నమోదు చేశారు.
2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) తరపున చేవెళ్ళ లోకసభ నియోజకవర్గం నుండి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోటిచేసి గెలుపొందారు. ఆ తర్వాత 2018లో టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మూడేళ్లపాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆయన.. 2021లో రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అయ్యారు.