రైల్వేకోడూరు: తిరుపతి జిల్లా రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై కేసు నమోదైంది. శ్రీధర్ తనపై ఏడాదిన్నరగా అత్యాచారం చేశాడని జాతీయ మానవ హక్కుల కమిషన్కు బాధితురాలు ఫిర్యాదు చేసింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ నుంచి తిరుపతి ఎస్పీకి ఈ విషయంలో ఫోన్ వచ్చింది. వెంటనే ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో NHRC ఆదేశాలతో రైల్వే కోడూరు పీఎస్లో జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై కేసు నమోదైంది.
రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను లైంగికంగా వేధించాడంటూ ఒక మహిళ ఆరోపించడంతో ఏపీ రాజకీయాల్లో ఈ అంశం హాట్ టాపిక్ అయింది. ఏడాదిన్నర పాటు తనను వాడుకొని వదిలేశాడంటూ ఆరోపిస్తూ సోషల్ మీడియాలో బాధితురాలు ఓ వీడియో షేర్ చేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. ప్రభుత్వ ఉద్యోగి అయిన బాధితురాలు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎన్నికల్లో గెలుపొందిన సమయంలో విషెస్ చెప్తూ.. టెలిగ్రామ్ యాప్లో మెసేజ్ చేశానని.. ఆ రెండు, మూడు రోజులు బాగా మాట్లాడిన అరవ శ్రీధర్ తనను న్యూడ్ ఫోటోలు పంపమని అడగటం మొదలు పెట్టాడని చెప్పుకొచ్చింది.
తాను భర్తకు దూరంగా ఉంటున్నానన్న విషయం తెలుసుకున్న శ్రీధర్ లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడని.. తన భర్తకు విడాకులు ఇవ్వాలని ఒత్తిడి చేశాడని.. ఒప్పుకోకపోతే నీ ప్రమోషన్, ట్రాన్స్ఫర్ నా చేతిలోనే ఉన్నాయంటూ బెదిరించేవాడని అంటోంది బాధితురాలు. ఏడాదిన్నర పాటు తనను వాడుకున్న శ్రీధర్ ప్రెగ్నెంట్ అయ్యాక బెదిరించి అబార్షన్ చేయించాడని బాధితురాలు వాపోయింది.
