ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, ఆపార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు ఎలాంటి ఆధారాలు లేనందున 2013 లోనే ఈ కేసును మూసివేసినట్లు సుప్రీం కోర్టులో అఫిడవుల్ దాఖలు చేసింది.
ములాయం కుటుంబం ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు రావడంతో సీబీఐ దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ నేత విశ్వనాథ్ చటర్జీ 2005లో సుప్రీం కోర్టులో పటిషన్ వేశారు. దీనిపై విచారించిన కోర్టు 2007లో ములాయం కుటుంబంపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. ఆ తర్వాత డింపుల్ యాదవ్ కు కేసు నుంచి మినహాయింపునిచ్చింది కోర్టు. తర్వాత ఈ కేసుపై ఎలాంటి పురోగతి లేకపోవడంతో విశ్వనాత్ ఛటర్జీ మరోసారి సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఈ సందర్భంగా కేసు ఏమైందని ప్రశ్నించగా ఇవాళ క్లీన్ చిట్ ఇస్తూ సుప్రీం కోర్టులో అఫిడవుల్ దాఖలు చేసింది సీబీఐ.