సిమెంట్ రంగంలో మరిన్ని విలీనాలు.. చిన్న కంపెనీలపై పెద్ద వాటి నజర్

సిమెంట్ రంగంలో మరిన్ని విలీనాలు.. చిన్న కంపెనీలపై పెద్ద వాటి నజర్

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సిమెంట్​కు భారీ డిమాండ్ ఏర్పడుతోంది. ఇది​ సిమెంట్ రంగంలో ఏకీకరణకు దారి తీస్తోందని మూడీస్ రేటింగ్స్ తెలిపింది. దీని ప్రకారం.. పెద్ద సంస్థలు చిన్న ప్రాంతీయ సంస్థలను కొనుగోలు చేస్తూ, పెరుగుతున్న వినియోగానికి సరిపోయేలా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. గత ఐదేళ్లుగా, భారతదేశంలోని సిమెంట్ రంగంలో భారీ ఎత్తున విలీనాలు, కొనుగోళ్లు జరిగాయి. దేశంలోని టాప్​-10 కంపెనీలు సుమారు 140 మిలియన్ మెట్రిక్ టన్నులు పర్ ఆనమ్ (ఎంఎంటీపీఏ) ఉత్పత్తి సామర్థ్యం గల  దేశీయ సిమెంట్ కంపెనీలను కొనుగోలు చేశారు. దీని విలువ సుమారు రూ.89 వేల కోట్లు (10.5 బిలియన్ల అమెరికన్ డాలర్లు).

పెద్ద కంపెనీలు చిన్న, ప్రాంతీయ సంస్థలను కొన్నాయి.  ఈ రంగంలో బడా కంపెనీలు అల్ట్రాటెక్, అంబుజా వంటివి తక్కువ సామర్థ్య వినియోగం,  తక్కువ లాభదాయకత కలిగిన చిన్న సంస్థలను కొన్నాయి లేదా విలీనం చేసుకున్నాయి. భారత్లో 70కి పైగా చిన్న సిమెంట్ ఉత్పత్తిదారులు ఉన్నారు. ఇతర ప్రాంతాలలో ఉన్న సంస్థలతో పోలిస్తే దక్షిణ భారతదేశంలోని కంపెనీలు ఎక్కువగా విలీనమయ్యాయి.  తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 200 ఎంఎంటీపీఏ సామర్థ్యం గల కంపెనీలు ఉన్నాయి.  దక్షిణ భారతదేశం దేశంలోనే అతిపెద్ద సిమెంట్ ఉత్పత్తి ప్రాంతం. ఆ తర్వాత ఉత్తర, తూర్పు ప్రాంతాలు ఒక్కొక్కటి సుమారు 150 ఎంఎంటీపీఏ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. 

పెద్ద కంపెనీల హవా
ఆదిత్య బిర్లా గ్రూప్​సంస్థ అల్ట్రాటెక్,  అదానీ కంపెనీ అంబుజా మనదేశంలోని టాప్​-2 సిమెంట్ ఉత్పత్తిదారులు. ఈ వృద్ధిలో వీటి వాటా సుమారు 30 శాతం వరకు ఉండొచ్చు. శ్రీ సిమెంట్, దాల్మియా భారత్ వరుసగా మూడో, నాలుగో స్థానంలో ఉన్నాయి. ఇవి సుమారు 50 ఎంఎంటీపీఏ సామర్థ్యాన్ని పెంచాయి. రాబోయే సామర్థ్య విస్తరణలలో వీటి వాటా సుమారు 25 శాతం వరకు ఉండొచ్చు. జేకే సిమెంట్, జేఎస్​డబ్ల్యూ సిమెంట్, జేకే లక్ష్మీ సిమెంట్ వంటి చిన్న సంస్థలు తమ ప్రస్తుత సామర్థ్యాన్ని దాదాపు రెట్టింపు చేస్తాయి. భారతదేశ తలసరి సిమెంట్ వినియోగం 260 కిలోలు కాగా, ఇది ప్రపంచ సగటు వినియోగం 540 కిలోల సగం కంటే తక్కువ.

2023-24 ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి 445 ఎంఎంటీపీఏ నుంచి 2030 నాటికి సుమారు 670 ఎంఎంటీపీఏ చేరుకుంటుంది.  గృహ నిర్మాణం, ఇన్​ఫ్రా నుంచి భారీ డిమాండ్​ ఉంది.  ముడి పదార్థాల ధరలలో పెరుగుదల కంపెనీల లాభదాయకతను తగ్గిస్తోంది. ఉదాహరణకు  ఈ ఏడాది ఫిబ్రవరిలో తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలో సున్నపురాయి తవ్వకంపై టన్నుకు 160 చొప్పున  పన్ను విధించింది. సగటు పరిశ్రమ లాభదాయకత టన్నుకు రూ.800-–-900 కాగా, ఇలాంటి పన్నులు,  సుంకాలు లాభాలను దాదాపు 15 నుంచి 20 శాతం వరకు తగ్గిస్తాయి. బొగ్గు,  పెట్రోలియం కోక్ ను భారీగా దిగుమతి చేసుకోవాల్సి రావడంతో ఉత్పత్తి ఖర్చు పెరుగుతోంది.

ఫుల్ డిమాండ్..
మనదేశంలో సిమెంట్ గిరాకీ ఈ దశాబ్దం చివరి వరకు గణనీయంగా పెరుగుతుందని అంచనా. పెరుగుతున్న గృహ అవసరాలు, ఇన్​ఫ్రాకు  ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించడం వల్ల వినియోగ వృద్ధి ఏటా 6 నుంచి 7 శాతం ఉంటుంది.  దేశవ్యాప్త ఉనికిని కలిగిన పెద్ద సంస్థలు తక్కువ సామర్థ్య వినియోగం  తక్కువ లాభదాయకత కలిగిన చిన్న కంపెనీలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. 

పెద్ద కంపెనీలు పెరుగుతున్న గిరాకీని తీర్చడానికి సామర్థ్యాన్ని పెంచుతున్నందున పరిశ్రమ సామర్థ్యం తదుపరి ఐదేళ్లలో మూడింట ఒక వంతు విస్తరించే అవకాశం ఉంది. భారతదేశంలోని టాప్​-10 సిమెంట్ కంపెనీలు (సుమారు 75 శాతం మార్కెట్ వాటా వీటి సొంతం) భారీగా ఉత్పత్తిని పెంచుతామని ప్రకటించాయి. దీంతో మొత్తం పరిశ్రమ సామర్థ్యం ఈ దశాబ్దం చివరి నాటికి సుమారు 30 శాతం లేదా 200 ఎంఎంటీపీఏలకు పెరుగుతుంది. ఈ కొత్త సామర్థ్యంలో సుమారు 170 ఎంఎంటీపీఏ 2027-28 ఆర్థిక సంవత్సరం నాటికి అందుబాటులోకి వస్తుంది.