
- 4 వేల షెల్ కంపెనీల ఏర్పాటు
- 16 వేల నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లు
- దొంగిలించిన ఐడీల వాడకం
న్యూఢిల్లీ: ఒకటిరెండు కోట్ల రూపాయలు కాదు ఏకంగా రూ.30 వేల కోట్ల విలువైన జీఎస్టీ ఎగ్గొటారు. ఇందుకోసం ఎన్నో నక్కజిత్తులు వేశారు. 18 వేల పాన్కార్డులను, ఆధార్కార్డులను వాడారు. నాలుగు వేల షెల్ కంపెనీలను ఏర్పాటు చేశారు. 16 వేల నకిలీ రిజిస్ట్రేషన్లను సృష్టించారు. పీఎం కిసాన్ వంటి సామాజిక భద్రతా పథకాల లబ్ధిదారుల గుర్తింపుకార్డులను షెల్ కంపెనీల ఏర్పాటు కోసం, నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్ల కోసం ఉపయోగించారు. దర్యాప్తులో ఈ వివరాలన్నీ బయటికి వచ్చాయి.
జీఎస్టీ అధికారులు ఈ ఏడాది మే 16 నుంచి రెండు నెలల పాటు జీఎస్టీ ఎగవేతల నిరోధక కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటి వారంలోనే సుమారు 10 వేల నకిలీ రిజిస్ట్రేషన్లను కనుగొన్నారు. ఆదాయపు పన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహా మరికొన్ని ఏజెన్సీల సాయంతో ఈ రాకెట్గుట్టురట్టు చేశారు. మొత్తం 16 రాష్ట్రాల్లో వ్యవస్థీకృత (ఆర్గనైజ్డ్) ఎగవేతలను గుర్తించారు. సంబంధిత వ్యక్తులపై, సంస్థలపై ప్రత్యేక చర్యలను తీసుకుంటున్నారు. ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.
ప్రధానమంత్రి కిసాన్ యోజన, గ్రామీణ ఉపాధి పథకం వంటి స్కీముల లబ్దిదారుల డేటాను దొంగిలించిన 16 రాష్ట్రాల్లో షెల్ కంపెనీలను ఏర్పాటు చేశారు. నకిలీ బిల్లులను రూపొందించడానికి షెల్ కంపెనీలను ఉపయోగించారు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేయడానికి వివిధ కంపెనీలకు వాటిని విక్రయించారు. దొంగిలించిన ఐడీ కార్డులతో నకిలీ ఈ–-వే బిల్లులు లేదా నకిలీ ఇన్వాయిస్లను రూపొందించారు.