
ముంబై: ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు కుట్ర కేసుకు సంబంధించి కొత్త ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి. ఆ కేసులో లూప్హోల్స్ ఉన్నాయని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్పవర్ పుణె పోలీసులతో పేర్కొన్నట్టు వార్తలు వస్తున్నాయి. 2017 ఎల్గర్ పరిషత్– భీమా కొరేగావ్ అల్లర్ల కేసుకు సంబంధించి 2018 ఆగస్టులో వరవరరావు, సుధీర్ ధవళ, రోనా విల్సన్, సురేంద్ర గాడ్లింగ్, మహేశ్ రౌత్, షోమా సేన్, అరుణ్ ఫెరీరా, వెర్నన్ గొన్సాల్వెజ్, సుధా భరద్వాజ్లను పుణె పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. విచారణలో భాగంగా ప్రధాని మోడీని హత్య చేసేందుకు ‘అర్బన్ నక్సల్స్’కుట్ర పన్నారంటూ పోలీసులు పేర్కొన్నారు. వాళ్లపై అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (యూఏపీఏ) కింద కేసు పెట్టి 5 వేల పేజీల చార్జిషీటును దాఖలు చేశారు. అయితే, వాళ్లను కుట్రపూరితంగా కేసుల్లో ఇరికించారని, కేసును సిట్తో దర్యాప్తు చేయించాలని ఎన్సీపీ చీఫ్ శరద్పవార్ జనవరి 10న రాష్ట్ర ప్రభుత్వానికి రెండు లేఖలు రాశారు. ఈ నేపథ్యంలోనే పుణే పోలీసులతో అజిత్ పవార్ రివ్యూ మీటింగ్ పెట్టారు. చార్జిషీటులో లుకలుకలున్నట్టు పోలీసులకు ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. ఈ రివ్యూలో మహారాష్ట్ర డీజీపీ సుబోధ జైస్వాల్, స్టేట్ ఇంటెలిజెన్స్ కమిషనర్ రష్మి శుక్లా, సీనియర్ ఐపీఎస్లు పాల్గొన్నారు.