
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి రామచంద్రాపురంలో ప్రధాన రహదారిపై భారీగా నీరు చేరింది. దీంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ బుధవారం ఆ ప్రాంతాన్ని సందర్శించారు. వరద కాలువలు పూడుకుపోవడంతో జేసీబీలతో పూడికతీయించి, విస్తరించారు. అనంతరం లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్యూబీ) ప్రాంతాలను పరిశీలించారు.
అక్కడి వరద, మురుగు కాలువలను పరిశీలించారు. లింగంపల్లి పాత మున్సిపల్ కార్యాలయం ముందు నుంచి ఆదర్శనగర్, డోయిన్ నగర్, సుభాష్నగర్ నుంచి వచ్చే మురుగునీటి కాలువలో పేరుకుపోయిన చెత్తతోనే ఈ సమస్య ఏర్పడిందని గుర్తించారు. వెంటనే ఆ చెత్తను తొలగించాలని సిబ్బందికి సూచించారు.
మైత్రి నగర్, ఘట్కేసర్లో ఆక్రమణల తొలగింపు
గచ్చిబౌలి : చందానగర్ సర్కిల్ మైత్రి నగర్ కాలనీ పార్క్లో అక్రమంగా మట్టిని నింపుతున్నారంటూ ప్రజావాణిలో కాలనీవాసులు అందజేసిన ఫిర్యాదుపై హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారు. బుధవారం ఉదయం హైడ్రా బృందం మైత్రి నగర్ పార్కును సందర్శించి పార్కులో నింపిన మట్టిని జేసీబీల సహాయంతో తొలగించారు. ప్రభుత్వ స్థలాల ఆక్రమణలకు పూనుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం పార్కు స్థలమని బోర్డును ఏర్పాటు చేశారు.
ఘట్కేసర్ : ఘట్కేసర్లోని జయపురి కాలనీ లే-అవుట్లో పబ్లిక్ రోడ్లను ఆక్రమించి కబ్జాదారులు గోడలు నిర్మించారని ప్లాట్ యజమానులు ఫిర్యాదు చేయడంతో హైడ్రా చర్యలకు దిగింది. కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలతో రహదారులకు అడ్డుగా నిర్మించిన ప్రహరీ గోడలను అధికారులు బుధవారం తొలగించారు.