- ఓటేసి బైక్ ఎక్కుతున్న మహిళ మృతి
- కొంతదూరం ఈడ్చుకెళ్లిన కారు
- ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మృతురాలి కుటుంబసభ్యుల ఫైర్
- కాజీపేటలోని ఫాతిమానగర్ బ్రిడ్జిపై ఆందోళన
కాజీపేట, వెలుగు: కారును ఓవర్ స్పీడ్ గా నడుపుకుంటూ వచ్చిన ఓ ఎక్సైజ్ సీఐ కొడుకు ఓటేసి వచ్చి బైక్ ఎక్కుతున్న మహిళను ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను దవాఖానకు తరలిస్తుండగా చనిపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ బాధిత కుటుంబ సభ్యులు రోడ్డెక్కారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం...దర్గా కాజీపేట శౌరినగర్లో ఉండే గాదె కవిత(39) హనుమకొండలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో స్టాఫ్నర్సు. ఎన్నికల్లో ఓటు వేసేందుకు తన భర్త జోసెఫ్రెడ్డితో కలిసి ఫాతిమానగర్ సెయింట్గాబ్రియల్ స్కూల్ కు గురువారం ఉదయం 10 గంటలకు వచ్చింది. ఓటేసిన తర్వాత 11.15 గంటల ప్రాంతంలో బయటకు వచ్చింది. అక్కడి నుంచి ఇంటికి వెళ్లేందుకు బైక్ఎక్కుతుండగా..హైదరాబాద్లో ఎక్సైజ్ సీఐగా పని చేస్తున్న శరత్ కొడుకు వంశీ భార్గవ్ కారులో కాజీపేట నుంచి దర్గా వైపు వేగంగా వస్తూ కవితను ఢీకొట్టాడు. ఓవర్స్పీడ్గా నడపడం, కారు కంట్రోల్ కాకపోవడంతో కొంతదూరం అలాగే ఈడ్చుకెళ్లాడు. దీంతో కవితకు తలకు తీవ్ర గాయమైంది. 108లో దవాఖానకు తరలిస్తుండగా చనిపోయింది. మృతదేహాన్ని వరంగల్ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతురాలికి ఇద్దరు కూతుళ్లున్నారు.
రోడ్డెక్కిన మృతురాలి కుటుంబసభ్యులు
వరంగల్ఎల్లంబజార్కు చెందిన వంశీభార్గవ్రెండు రోజుల్లో ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లనున్నట్లు తెలిసింది. ఈయన తండ్రి శరత్కుమార్ హైదరాబాద్లో ఎక్సైజ్ సీఐ కావడం, కేసు నమోదైతే విదేశాలకు వెళ్లేందుకు ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశంతో పోలీసులు కేసు నమోదు చేయడం లేదంటూ బాధిత కుటుంబ సభ్యులు కాజీపేట స్టేషన్ఎదుట ఆందోళనకు దిగారు. స్పందన లేకపోవడంతో ఫాతిమానగర్ బ్రిడ్జి వద్దకు వెళ్లి బైఠాయించారు. దీంతో వరంగల్–-హైదరాబాద్ హైవేపై వాహనాలు నిలిచిపోయాయి. రెండు గంటల పాటు రాస్తారోకో చేయగా, భారీగా ట్రాఫిక్ జామైంది. కాజీపేట పోలీసులు వచ్చి సర్దిచెప్పే ప్రయత్నం చేయగా బాధిత కుటుంబ సభ్యులు పోలీసులతో వాదనకు దిగారు. విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విమరించారు. సీఐ సార్ల రాజును వివరణ కోరగా.. తాను ఎలక్షన్డ్యూటీలో ఉండగా హెడ్కానిస్టేబుల్సక్రమ్ కేసు నమోదు చేశాడని, నిందితుడు దొడ్ల వంశీ భార్గవ్ను రిమాండ్ కు తరలించినట్లు వివరించారు.